హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయటం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్సభ స్పీకర్ రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయటం, ఆ వెంటనే నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం జారీ చేయటం చూస్తుంటే వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తున్నదని ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్లో నారాయణ మాట్లాడుతూ ఈ వ్యవహారంలో మోదీ, అదానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి పనికానిచ్చినట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. రాహుల్గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్గాంధీపై వ్యక్తిగత కక్షతో వేధిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు బీజేపీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.