హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి బరితెగించి తూట్లు పొడుస్తున్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మగ్ధూంభవన్లో గురువారం సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, ఎన్ బాలమల్లేశ్, నర్సింహతో కలిసి మీడియాతో మాట్లాడారు. మోదీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు.
ప్రాం తీయ పార్టీలతో ఇబ్బందులు ఉంటే ఆయా రాష్ర్టాలకే పరిమితం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరమున్నదని జాతీయ సమావేశాల్లో నిర్ణయించామని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అభ్యంతరాన్ని పరిగణనలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిని మార్చడం ఎందుకంటూ తప్పుపట్టారు. కేంద్ర బలగాలను దింపి విచ్చలవిడిగా డబ్బులు పంచి గెలవాలని బీజేపీ భావిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కాగా, క్యూబా దేశ రాజధాని హవానాలో ఈనెల 27 నుంచి జరిగే అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశానికి నారాయణ హాజరుకానున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు.