Narayana | హైదరాబాద్ : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల బాధల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల నిరసనకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ భారీ పోలీసు-సైనిక అణిచివేతను నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేదర్ విగ్రహం వద్ద సోమవారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. సీపీఐ శ్రేణులు ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేతబూని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, ఆందోళనలు చేస్తున్న రైతు సమాజానికి సంఘీభావం తెలిపారు.
ఈ నిరసనలో డా.కె. నారాయణతోపాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, కలవేణి శంకర్, ఎన్. బాలమల్లేష్, ఈటీ నరసింహ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రైతుల ఆందోళనను అణిచివేయాలనే ధోరణితో మోదీ ప్రభుత్వం ముందుకుసాగుతుందని, పోలీసులతో పాశవికంగా దాడులు చేయిస్తూ హత్యాకాండను సృష్టిస్తుందని ఆరోపించారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుపై జరిగిన పోలీస్ కాల్పుల్లో శుభకరన్ సింగ్ అనే రైతు మృతి ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలని అయన డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ తప్పుడు వాగ్దానాలు చేసి, రైతులను పరిగణనలోకి తీసుకోకుండా రైతు వ్యతిరేక చట్టాలను ప్రయోగించి బడా వ్యాపారులకు వ్యవసాయాన్ని అప్పగించే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే దేశ వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.