హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 27 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. మంగళవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. బుధ, గురువారాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, ములుగు, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 5.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 4.80 సెం.మీ, ఆదిలాబాద్ అర్బన్లో 4.61 సెం.మీ, బోరాజ్లో 4.60 సెం.మీ, జైనాడ్లో 4.45 సెం.మీ, వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్లో -36గా నమోదైన లోటు వర్షపాతం
వానకాలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 50 రోజుల్లో సగటున 21 రోజుల పాటు వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు 24 జిల్లాల్లో -18 నుంచి -57 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో-57 శాతం, హనుమకొండలో-54, వరంగల్-49, యాదాద్రి-భువనగిరిలో-46, జనగామలో-45, వికారాబాద్లో-37, కరీంనగర్లో-37, హైదరాబాద్లో-36, ఆదిలాబాద్లో-35, వనపర్తిలో-35, నిజామాబాద్లో -33, జగిత్యాలలో-32, నారాయణపేటలో-32, ఖమ్మంలో-30, మహబూబాబాద్లో-30, భద్రాద్రి-కొత్తగూడెంలో -29, జయశంకర్ భూపాలపల్లిలో-27, సూర్యాపేటలో-27, నిర్మల్లో-26, మహబూబ్నగర్లో-26, సిద్దిపేటలో-26, మంచిర్యాలలో-20 చొప్పున లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.