హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉచిత విద్యుత్తును పూర్తిస్థాయిలో అమలుచేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్తురంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో వైఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టగా, కేసీఆర్ పూర్తిస్థాయిలో అమలుచేశారని వివరించారు. కిరణ్కుమార్రెడ్డి హయాంలోనే కేటీపీఎస్ మంజూరు కాగా 2014 తరువాత ప్రారంభమైందని చెప్పారు.
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు కేంద్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటయ్యాయని తెలిపారు. విద్యుత్తు రంగం అప్పుల్లోకి పోయిందని, వాటిని ఎలా పూడ్చుకోవాలో ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు కోసం 15 నుంచి 20 వేల కోట్లు అవసరమవుతాయని, ప్రభుత్వం ఈ నిధులు భరించకపోతే భవిష్యత్తులో రైతులకు విద్యుత్తు అందే అవకాశం లేదని, విద్యుత్తు సంస్థలు కూడా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణిలో రూ.50-60 వేల కోట్లు పక్కదారి పట్టాయని, సింగరేణి సంస్థను కూడా జ్యుడిషియల్ విచారణ పరిధిలోకి తీసుకొని రావాలని సూచించారు.