కొత్తగూడెం గణేశ్టెంపుల్/ ఖమ్మం కమాన్బజార్, కరీంనగర్ తెలంగాణ చౌక్, హైదరాబాద్, జూన్ 10: ప్రధాని మోదీ దేశంలోని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పొట్టగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
ఇంధన, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా సీపీఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద పార్టీ శ్రేణులు బుధవారం భారీ ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యే కూనంనేని ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్లను ముట్టడించారు. పెంచిన ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లలోకి నాయకులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
కరీంనగర్ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించగా తోపులాట జరిగింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఇష్టారాజ్యంగా లాక్కెళ్లారని సీపీఐ నాయకులు మండిపడ్డారు. సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ దోచిపెడుతున్నారని, సామాన్యుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ నుంచి కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.