హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని గట్టిగా వ్యతిరేకించేవారిపై ఈడీ, ఐటీలతో బీజేపీ సర్కారు దాడులు చేయిస్తున్నదని, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం అందులో భాగమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఒకవేళ ప్రధాని మోదీకి జై కొడితే రాత్రికి రాత్రే కేసు లు మాయమవుతాయని అన్నారు. శారద, నారద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న తృణమూల్ నేతలు బీజేపీలో చేరగానే, ఆ కేసులు ఏమయ్యాయో అందరూ చూశారని చెప్పారు.
గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై ఏకపక్ష దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. మహిళాబిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని చెప్పారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. జీ-20లో పువ్వు గుర్తును లోగోగా పెట్టడం కేంద్రప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని, దాన్ని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీని బలహీనపర్చడం కోసమే పవన్ కళ్యాణ్ను బీజేపీ తమవైపు లాగుతున్నదని చెప్పారు.