హైదరాబాద్ : మోదీ ప్రభుత్వం కాంటాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో సింగరేణి సంస్థను బతికుండగానే చంపేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మండిపడ్డారు. నొప్పి లేకుండా జలగ రక్తాన్ని ఎలా పీలుస్తుందో.. మోదీ సైతం సింగరేణి సంస్థ రక్తాన్ని పీలుస్తున్నారని విమర్శించారు. మోదీ పర్యటన రాజకీయ దురుద్దేశంతోనే కూడిందే తప్పా.. రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, ఈటీ నర్సింహాతో కలిసి హైదరాబాద్ ముగ్ధుం భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి కుంభకోణానికి మోదీ ప్రభుత్వమే నాయకత్వం వహిస్తోందని ఆరోపించారు. తమ కార్యాలయంలోకి ఎప్పుడు రానీ పోలీసులు.. మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే మాత్రం లోపలికి వచ్చారన్నారు.
బీజేపీని రాష్ట్రంలో అభివృద్ధి చేసుకునేందుకు, మనుగోడులో ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరాశచెందకుండా ఉండేందుకే మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారన్నారు. సింగరేణి సంస్థలో 49 శాతం వాటా ఉన్న కేంద్రం దీన్ని ప్రైవేటు పరం చేయలేదని, అందుకే ఈ సంస్థను బతికి ఉండగానే చంపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2015లో గోదావరి పరీవాహక ప్రాంతంలోని బొగ్గుబావిని సింగరేణికి ఇవ్వాలనే మైన్స్ మినరల్స్ డెవలప్ రెగ్యులేషన్ చట్టాన్ని 2015లో సవరించి, కమర్షియల్ మైనింగ్ అనుమతినిచ్చారని, తద్వారా ఇప్పటికే 240 మైన్స్ ప్రైవేటుకు ఇవ్వాలని గుర్తించారని, ఇందులో 98 మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారని, ఇందులో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారని నారాయణ ఆరోపించారు.
ఇల్లందులోని కైరాగూడ ఓసీ3 మైన్, సత్తుపల్లిలోని ఓసీ 3మైన్, మందమర్రిలో శ్రావణపల్లి, కళ్యాణఖణిలను ప్రైవేటుపరం చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు వివరించారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బావులను ప్రైవేటుకు అప్పగించిన తర్వాత సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతుందని, తద్వారా బతికి ఉండగానే సింగరేణిని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీలో పోలవరం, ప్రత్యేక హోదాలాంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఏపీలో వైఎస్ బలంగా ఉండాలని, టీడీపీని బలహీనంగా ఉంచి.. బలపడాలన్నదే బీజేపీ ఉద్దేశమన్నారు. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో తెలివైన వ్యక్తని, అందుకే మునుగోడులో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారన్నారు. అమ్ముడుపోయే వారికి కమ్యూనిస్టులు కూడా అమ్ముడుపోయినట్టుగా కనిపిస్తుందని విమర్శించారు. తాము సిద్ధాంత, విధానాలతోనే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చిల్లర కొట్టుగా అవినీతి జరిగితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోల్ సింగిల్ విండో కుంభకోణం జరిగిందని నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ అవినీతిపరుల పని పడుతామని చెబుతున్నారని, అలా చేస్తే తమ మద్దతు ఉంటుందన్నారు. రూ.7,500 కోట్ల అప్పును ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించిన అదానీకి.. మోదీ ప్రధాని వచ్చిన ప్రస్తుతం ఆర్థికంగా ప్రపంచంలోనే రెండవ వ్యక్తిగా ఎలా మారుతారని ప్రశ్నించారు. ముందుగా అదాని వెంట పడాలని, ఏమీ లేకుండా దేశాన్ని దోచుకోకుండానే ఇంత మొత్తంలో ఆయన ఎలా సంపాదించారని నిలదీశారు. అసలైన కుంభకోణాలు, అవినీతిపరులు మోదీ వద్దనే ఉన్నారన్నారు.