హైదరాబాద్ : దేశంలో ఆకలి, పేదరికాన్ని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న కూనంనేని మాట్లాడుతూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 107వ స్థానానికి దిగజారిందని మండిపడ్డారు.
దేశంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి కల్పించి ఆర్ధికంగా ఆ వర్గాలను అభివృద్ధి చేసేందుకు పార్లమెంట్లో లోపల, వెలుపల అనేక పోరాటాలు చేసి సాధించిన ఉపాధిహామీ పథకాన్ని ఆంక్షలు పెట్టి నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఉపాధిహామీ పథకానికి నిధుల కోత విధించి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కార్పోరేట్ కోట్లాది రూపాయల సబ్సిడీ ఇస్తూ ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ ఆదానీ, అంబానీలకు మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతున్నదన్నారు.