హైదరాబాద్ : రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్ రైస్ను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయబోమని బీజేపీ ప్రభుత్వం మొండికేసినప్పటికీ వడ్లను గతంలో మాదిరిగానే కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం తెలంగాణ రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చిందన్నారు.
యాసంగిలో వరి పంట వేసుకోండి అని రైతులకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు పంట చేతికొచ్చే సమయానికి అన్ని రకాల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించడంపై మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. క్షేత్రస్థాయి రైతుల పరిస్థితులను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఈ అంశాన్ని రాజకీయాలకు వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు.
బ్యాంకులకు కార్పొరేట్ కంపెనీలు బకాయి పడిన వేల కోట్ల రూపాయలను రద్దుచేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకోకపోవడం రైతు వ్యతిరేక ధోరణిని మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం పంట కొనుగోలు కేంద్రాలను రెండు, మూడు రోజుల్లోనే ఏర్పాటు చేయించాలని కోరారు. వేసవి తీవ్రమైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఎండకు రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సీపీఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.