హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు తీరు అప్రకటిత ఎమర్జెన్సీ, నిరంకుశ పాలనకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపడితే కఠిన చర్యలు తప్పవని బెదిరిస్తారా అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజ లు, ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తే ఏ ప్రభుత్వానికైనా పుట్టగతులుండవని హెచ్చరించారు.
ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓపీఎస్ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో నిరసనల్లో పాల్గొంటే చర్యలు, జీతభత్యాల కోత, క్రమశిక్షణ చర్యలు తప్పవని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం హుకూం జారీచేయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసన తెలుపడం రాజ్యాంగం కల్పించిన హకు అని, దానికి భిన్నంగా కేంద్రం వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. వ్యాపారవేత్త అదానీ కోసం విధానాలను అనుకూలంగా మారుస్తున్న కేంద్రం.. ఉద్యోగులు పెన్షన్ హకు పునరుద్ధరణకు ఉద్యమిస్తే అణచివేసేందుకు సిద్ధపడటం దమననీతికి నిదర్శనమని విమర్శించారు. డీవోపీటీ సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని, ఓపీఎస్ సార్వత్రిక పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.