నల్లగొండ: కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం కృతజ్ఞతలు తెలిపాయి. రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయి.. కమ్యూనిస్టులు అమ్ముడు పోయారంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని సీపీఐ, సీపీఎం పార్టీల నల్లగొండ జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పదవులు, కాంట్రాక్టుల కోసం అధికార పార్టీల్లోకి పోవడం కమ్యూనిస్టుల చరిత్రలోనే లేదని వారు తెలిపారు.
రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్ను వదిలి, కాసుల కోసం కాషాయం కండువా కప్పుకున్న రాజగోపాల్రెడ్డికి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని వారు మండిపడ్డారు. 2018లో తాము రాజగోపాల్రెడ్డికి మద్దతిచ్చి గెలిపించినా రాజకీయంగా ఎక్కడా కలుపుకుపోలేదని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎన్నడూ ప్రయత్నం చెయ్యలేదని ఆరోపించారు.
దేశంలో రైతు, కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీలో చేరి ఆ పార్టీ కుట్రలో భాగం పంచుకున్నందుకే తాము టీఆర్ఎస్ను బలపర్చి రాజగోపాల్ను ఓడించామని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు సత్యం, సుధాకర్ రెడ్డిలు పేర్కొన్నారు. కమ్యూనిస్టుల గురించి నీతిమాలిన మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అని వారు హెచ్చరించారు.