హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): పీవోడబ్ల్యూ జాతీయ కార్యదర్శి సంధ్య భర్త రామకృష్ణారెడ్డి మరణం పట్ల సీపీఐ ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. రామకృష్ణారెడ్డి మరణం ప్రజా ఉద్యమాలతో మమేకమైన ఆ కుటుంబానికి తీరనిలోటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ, సీనియర్ నాయకులు ప్రేమ పావని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీపీఐలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆరెకంటి సుబ్బారెడ్డి, సుబ్బమ్మ సంతానమైన రామకృష్ణారెడ్డి హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీవనం కొనసాగించారని తెలిపారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్యను ఆయన ఆదర్శ వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని పశ్యపద్మ, ఇతర సీపీఐ నేతలు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.