CPI | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): మునుగోడు సీటు సీపీఐ రాష్ట్ర ముఖ్య నేతల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ విభేదాలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగి తారస్థాయికి చేరాయి. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, నల్లగొండ జిల్లా ఇన్చార్జి పల్లా వెంకట్రెడ్డి మధ్య మాటామాట పెరిగినట్టు సమాచారం.
కొత్తగూడెం సీటు కోసమే కూనంనేని తాపత్రయపడుతున్నారని, కాంగ్రెస్ పొత్తులో మునుగోడు సీటు కచ్చితంగా ఉండాల్సిందేనని పల్లా వెంకట్రెడ్డి గట్టిగా డిమాండ్ చేసినట్టు తెలిసింది. సీపీఐ కోరినట్టు బెల్లంపల్లి, మునుగోడు, వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలను కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారు. ఈ జాబితాలో చెన్నూరు లేకపోయినా కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు సీటు కేటాయించాల్సిందేనని నల్లగొండ జిల్లా నేతలు పట్టుబడుతున్నారు.
ఐదు స్థానాలు కేటాయించాల్సిందేనని, లేదంటే ఇతర వామపక్షాలతో కలిసి పార్టీకి బలమున్న చోట్ల పోటీ చేయాలని సీపీఐ కార్యదర్శివర్గం నిర్ణయించింది. ఈ విషయంపై మంగళవారం మరోసా సమావేశం కావాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా సీపీఎం భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ స్థానాలను కోరుతున్నది. కాంగ్రెస్ తన మొదటి జాబితాలోనే భద్రాచలం స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ఖరారు చేసింది.
ఆయా స్థానాల్లో కాంగ్రెస్లోనే పోటాపోటీ నెలకొంది. దీంతో కాంగ్రెస్ ఆ మూడు కేటాయిస్తే కలిసి పోదాం, లేదంటే ఒంటరిగా పోటీ చేద్దామనే యోచనలో ఆ పార్టీ ఉన్నది. పొత్తు అంశం తేల్చడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తుండటంపై వామపక్ష నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇతర వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపించడం లేదు.