నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర భగ్నమైంది. కాంగ్రెస్ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలుగా వ్యవహరించిన పోలీసులకు నాంపల్లి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాల్కసుమన్ ఎదుర్కొంటున్న ఆరోపణలకు, అతనిపై పెట్టిన సెక్షన్లకు సంబంధం లేకపోవడంతో పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ సెక్షన్లను కొట్టివేసిన జడ్జి, ఆ సెక్షన్లు నమోదుచేసిన దర్యాప్తు అధికారికి షోకాజ్ నోటీసు జారీచేసింది.
దీంతో రాజకీయ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తే తమకు ఇబ్బందులు తప్పవని పోలీసులు చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన బొగ్గుగని కార్మికుల సమావేశంలో బాల్కసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లిలోని సింగరేణి భవన్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాల్కసుమన్పై 326(జీ), 152, 351(బీ), 351(3), 353(1)(బీ), బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు పీడీపీపీ చట్టం రెడ్ విత్ 55, 61(2), సెక్షన్లు పెట్టారు. ఈ కేసుపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా బాల్కసుమన్ తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్కు చెందిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. బాల్కసుమన్పై నమోదుచేసిన పలు సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని తెలిపారు. ఇందులో పోలీసులు ఉద్దేశపూర్వకంగా, బాల్కసుమన్ను జైలులో పెట్టాలన్న ఆలోచనతో 326(జీ) సెక్షన్, పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలకు, నమోదుచేసిన సెక్షన్లకు పొంతన లేదని చెప్పారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. బాల్కసుమన్పై పెట్టిన పీడీపీపీ యాక్ట్ రెడ్ విత్ 55, 61(2)తోపాటు సెక్షన్ 326(జీ), 351(3) బీఎన్ఎస్ సెక్షన్లను తొలగించాలని ఆదేశించింది. తప్పుడు సెక్షన్లు చేసిన దర్యాప్తు అధికారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది.
పోలీసులకు షోకాజ్ ’షాక్’..!
రాజకీయ ప్రత్యర్థులపై పోలీసులు నమోదు చేస్తున్న కేసులు వివాదాస్పదమవుతున్నాయి. పైనుంచి వస్తున్న ఆదేశాలతో వారిపై ఏ యే సెక్షన్లు పెట్టాలనే నిర్ణయం జరిగిపోతున్నదని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగా విపక్ష నేతలను ఎలాగైనా జైల్లో పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండగా, వారి అడుగులకు కొందరు పోలీసులు మడుగులొత్తుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు, తమ పరిధిని దాటేస్తూ కోర్టు ముందు పలుమార్లు ఇబ్బందిక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజా గా నాంపల్లి పోలీసులకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా అందులో భాగమేన్న చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతున్నది. చట్టాన్ని అపహాస్యం చేస్తూ అసలు కేసుకు వర్తించని సెక్షన్లను ఏ ప్రాతిపదికన నమోదు చేశారో వివరణ ఇవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశించడం పోలీసులలో అలజడి సృష్టించింది. తప్పుడు కేసులు బనాయించి నాయకుల మెప్పు కోసం పనిచేస్తే, కోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని పలువురు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. ప్రభు త్వం ఎన్ని కుతంత్రాలు పన్నినా, పోలీసులను ముందుంచి అణచివేతకు పాల్పడినా, ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థే సుప్రీం అని, చివరకు ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు.