Thatikunta Reservoir | జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవ్వడం గ్రామంలో కలకలం రేగింది.
వివరాల్లోకి వెళ్తే తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనిబావి రాముడు (40)-సంధ్య(35) భార్యభర్తలు. వీరిద్దరూ మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లారు. చేపల వేటకు వెళ్లిన దంపతులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఎంత వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి. బుధవారం మధ్యాహ్నం కావస్తున్నప్పటికీ ఇంకా దంపతుల ఆచూకీ దొరకలేదు. దీంతో వారికి ఏమై ఉంటుందోననే గ్రామస్తుల్లో ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ ఘటనపై గద్వాల పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.