నల్లగొండ: విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని విమర్శించారు. భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాదయాత్ర చేస్తున్న డిండి (Dindi) ప్రాంతంలోనే రెండు పంటలకు నీరు ఇచ్చింది కనపడడం లేదా అని నిలదీశారు. నల్లగొండలోని తన నివాసంలో మండలి చైర్మన్ గ్తు సుకేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగంలో ఎన్నో సాంకేతిక సమస్యలతో నాలుగేళ్లుగా శ్రీశైలం (Srisailam) నీటితో నిండుతున్నదని చెప్పారు. టన్నెల్ మరమ్మతులకు గురైతే ఆరు నెలలు ఆగాల్సి వస్తున్నదని, సొరంగం తవ్వకం పనులు ఇంకా 9 కిలోమీటర్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.
డిండి ఎత్తిపోతల పథకాల్లోని ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయని, ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలువలు తవ్వి వదిలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు తెచ్చిందని చెప్పారు. ఏఎమ్మార్పీ పూర్తిచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. హైదరాబాద్లో మీ ఇంటికి కూడా నీళ్లు వచ్చాయనేది మర్చిపోవద్దని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజశేఖర్ రెడ్డి వల్లె పంచ, దోతి కట్టడం తప్ప.. భట్టి విక్రమార్కకు మధిర నియోజకవర్గం తప్ప ఏదీ తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి తాము చేసిన ప్రగతికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు ఎవరో తెలియదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కలలు కన్నా ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.