పత్తి పంట మొత్తం ఒకేసారి చేతికి వస్తే..! ఇది ఒట్టి ఊహ కాదు. నిజం. ఇప్పటి మాదిరిగా పత్తిని రెండు మూడుసార్లు ఏరాల్సిన అవసరం ఇక ఉండదు. మొత్తం పంటంతా ఒకేసారి చేతికొచ్చే రోజులొస్తున్నాయి. ఇప్పుడున్న సాగు విధానంలో ఎకరానికి మహా అయితే ఏడెనిమిది వేల మొక్కలు మాత్రమే పెరుగుతున్నాయి. కానీ కొత్త విధానంలో వీటి సంఖ్య పాతిక వేలు! మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లకు, సాళ్ల మధ్య దూరం 80 సెం.మీ.కు పరిమితం కాబోతున్నది. ఇప్పుడు ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే లభిస్తున్న చోట 13 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి సాధించబోతున్నాం. ఇప్పటికే వరంగల్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నూతన సాగు విధానం విజయవంతం కావడంతో మలిదశ ప్రయోగాలకు అడుగులు పడుతున్నాయి. గతేడాది శాస్త్రవేత్తల స్థాయిలో సాగిన ప్రయోగాల్లో ఇప్పుడు రైతులూ భాగస్వాములవుతున్నారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): పత్తి సాగు విధానంలో విప్లవాత్మక మార్పు రాబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో వరంగల్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో గతేడాది ప్రయోగాత్మకంగా చేపట్టిన నూతన సాగు విధానం విజయవంతమైంది. దీంతో శాస్త్రవేత్తలు రెండోదశ ప్రయోగాలపై దృష్టి సారించారు. ఈ పద్ధతిలో ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడి మూడు రెట్లు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. నూతన విధానంలో ప్రధానంగా రెండు ప్రయోజనాలున్నాయి. వీటిలో ఒకటి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచగలగడం (హైడెన్సిటీ). రెండోది ఒకే కాతతో పంట మొత్తం ఒకేసారి చేతికి రావడం (సింగిల్ పికింగ్ క్రాప్). పత్తిని కోసిన తర్వాత శనగ, నువ్వులు వంటి రెండో పంటను పండించే అవకాశం లభించడం మరో సానుకూలాంశం. ఈ రెండింటితో పాటు యంత్రాల సహాయంతో పత్తిని ఒకేవిడుతలో ఏరేందుకు అవకాశం ఉంటుంది. ఇందు కు యంత్రాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ శాస్త్రవేత్తలను నిర్దేశించారు. ఆ మేరకు యంత్రం రూపొందించే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
గతేడాది పరిశోధనా కేంద్రంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన శాస్త్రవేత్తలు ఈ ఏడాది కొం దరు రైతుల భాగస్వామ్యంతో రెండో దశ ప్రయోగానికి సమాయత్తమయ్యారు. వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో 50 మందికి పైగా రైతులకు విత్తనాలు అందజేశారు. ఇది విజయవంతమైతే.. ఈ కొత్త రకం సాగు విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తారు. ఇందులో పాత రకం విత్తనాలే వాడటం మరో విశేషం.
ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న సాధారణ సాగు పద్ధతిలో ఎకరాకు 7-8 వేల పత్తి మొక్క లే పెరుగుతాయి. కానీ వరంగల్ పరిశోధనా కేంద్రంలో చేపట్టిన కొత్త పద్ధతిలో 25 వేల మొక్కలు పెరగడం విశేషం. ఈ విధానంలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, సాళ్ల మధ్య 80 సెంటీమీటర్ల దూరం ఉంటే సరిపోతుంది. సాధారణ సాగు పద్ధతిలో మొక్క మొక్కకు 60 -90 సెంటీమీటర్లు, సాలు సాలుకు మధ్య 100-120 సెంటీమీటర్ల దూరం ఉంటున్నది. కొత్త విధానంలో మొక్కల సంఖ్యకు తగ్గట్టుగా పత్తి దిగుబడి కూడా భారీగా పెరుగుతుంది.
ప్రస్తుత సాగు విధానంలో రైతులు పత్తిని రెండు, మూడుసార్లు తీయాల్సి వస్తున్నది. కానీ, కొత్త పద్ధతిలో ఒకే కాతలోనే మొత్తం పంట చేతికొస్తుంది. దీంతో పత్తిని తెంపగానే మరో పంటకు అవకాశమూ లభిస్తుంది. ఉదాహరణకు.. జూన్-జూలై నెలల్లో పత్తి గింజలు విత్తితే, నవంబర్-డిసెంబర్ కల్లా పంట చేతికొస్తుంది. భూమిని వృథాగా ఉంచకుండా వెంటనే శనగలు లేదా తెల్లనువ్వులు వంటి పం టలు పండించే అవకాశమూ లభిస్తుంది. వరంగల్ పరిశోధనా కేంద్రంలో గతేడాది జూలై 10న పత్తి విత్తనాలు వేయగా, 150-160 రోజుల మధ్యలో అంటే డిసెంబర్ కల్లా పంట చేతికొచ్చింది. ఈ కొత్త పద్ధతి సాగు విధానం గులాబీ పురుగు ఉధృతిని కూడా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
నూతన సాగులో పాత రకం విత్తనాలనే ఉపయోగించి, యాజమాన్య పద్ధతుల్లో మా ర్పులు చేశారు. ఎరువుల వాడకంలో జాగ్రత్త లు పాటించారు. అందువల్లే ఈ ప్రయోగం సక్సెస్ అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎకరాకు 50 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వ రం, పొటాష్ ఉపయోగించారు. 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు మరోసారి మెపిక్వాట్ క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. మొదటిసారి పూత దశలో లీటరు నీటిలో 1.5 మిల్లీలీటర్లు, రెండోసారి కాయ దశలో 2 మిల్లీలీటర్లు చొప్పు న కలిపి పిచికారీ చేశారు. ఈ రసాయనం మొక్క పెరుగుదలను నియత్రిస్తుంది. ఒకేసారి పూత, కాత వచ్చేలా ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు ఏడు రకాల విత్తనాలతో ప్రయోగం చేస్తున్నారు. ఇందులో మూడు హైబ్రిడ్, నాలు గు ఇతర రకాల విత్తనాలు. హైబ్రిడ్లో విన్నర్, సిరి, ఎన్సీఎస్-2728 విత్తనాలను ఉపయోగించగా, ఇతర రకాల్లో నాగ్పూర్లోని సెం ట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రిసెర్చ్ అందించిన పీకేవీ-081, సూరజ్, రజత్, జీఎస్హెచ్వీ-374 విత్తనాలను ఉపయోగించారు.
మూడు రెట్ల్ల దిగుబడి సాధారణ సాగుతో పోల్చితే కొత్త పద్ధతిలో పత్తి దిగుబడి మూడు రెట్లు పెరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. వరంగల్ పరిశోధనా కేంద్రంలో సాగు చేసిన హైబ్రిడ్ రకం విత్తనాల్లో 13-15 క్విం టాళ్ల దిగుబడి వచ్చింది. సాధారణ రకం విత్తనాల్లో 7-8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎక్కువ మొక్కలు నాటడం, సరైన యాజమాన్య పద్ధతులు
పాటించడంతో ఇది సాధ్యమైంది. గతేడాది అకాల వర్షాల్లోనూ వరంగల్ పరిశోధనా కేంద్రంలో 15 క్వింటాళ్ల దిగుబడి సాధించడం విశేషం. వాతావరణం అనుకూలిస్తే మరింత
దిగుబడి వచ్చేదని శాస్త్రవేత్తల అంచనా. ఈ పంటను పూర్తిగా వర్షాధారంగానే సాగు చేయడం గమనార్హం. ఇంకా నీటి పారకం ద్వారా సాగు చేస్తే దిగుబడి 25 క్వింటాళ్లకు పైగా వచ్చే అవకాశం
లేకపోలేదని తెలిపారు.
పత్తిలో హైడెన్సిటీ, సింగిల్ పికింగ్ క్రాప్ తొలి ప్రయోగం విజయవంతమైంది. ఆశించినస్థాయిలో దిగుబడి వచ్చింది. గతేడాది భారీ వర్షాలు కురిసినా దిగుబడి అధికంగా వచ్చింది. సాధారణ వాతావరణ పరిస్థితి ఉంటే దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త విధానంలో పాత రకం విత్తనాలను తీసుకున్నాం. యాజమాన్య పద్ధతుల్లో మార్పులు చేశాం. రెండో దశ విజయవంతమైతే.. రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది.
–ఉమారెడ్డి, సహ పరిశోధన డైరెక్టర్, వరంగల్ పరిశోధన కేంద్రం