RBI | ముంబై, ఏప్రిల్ 24: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం కొరడా ఝుళిపించింది. పదేపదే ఐటీ నిబంధనల ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించిన ఆర్బీఐ.. ఇక విసుగెత్తి ఆంక్షల్ని తెచ్చిపెట్టింది. ఇందులోభాగంగానే బ్యాంక్కు చెందిన ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ సాధనాలు, మార్గాల ద్వారా నూతన కస్టమర్లను తీసుకోవద్దని, కొత్తగా క్రెడిట్ కార్డులనూ జారీ చేయవద్దంటూ నిషేధం విధించింది. తమ ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సెంట్రల్ బ్యాంక్ ఓ ప్రకటనలో స్పష్టంగా తెలియజేసింది.
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో తీవ్ర లోపాలను గుర్తించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రకటించింది. 2022, 2023ల్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ రిస్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్ పరిశీలనల్లో ఆందోళనకర అంశాలను ఆర్బీఐ గుర్తించిందని, ఎన్నిసార్లు హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని, అందుకే ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నది. ఈ నెల 15న కూడా సమస్య వచ్చిందని, బ్యాంక్ కస్టమర్లు తీవ్రంగా అసౌకర్యానికి గురయ్యారని చెప్పింది. తాజా ఆంక్షలపై తమ ముందస్తు అనుమతితో బ్యాంక్ చేపట్టే సమగ్ర ఎక్స్టర్నల్ ఆడిట్ అనంతరమే మళ్లీ సమీక్షిస్తామని ఆర్బీఐ తేటతెల్లం చేసింది.
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో తమ ఐటీ వ్యవస్థల్ని నూతన సాంకేతికతలతో బలోపేతం చేస్తామని కొటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకొనేందుకు ఆర్బీఐతో కలిసి ముందుకెళ్తామన్నది. కాగా, తాము విధించిన ఆంక్షలు కొత్త కస్టమర్లకే వర్తిస్తాయని, పాత బ్యాంక్ ఖాతాదారులు, క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంక్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఎప్పట్లాగే అన్ని సేవలు అందుతాయని కొటక్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది.
ఇక ఇప్పటికే 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్పైనా ఇదే తరహాలో ఆర్బీఐ నిషేధం వేసింది. పలుమార్లు సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొత్త కార్డుల జారీ, నూతన డిజిటల్ కార్యక్రమాల పరిచయంపై ఆంక్షలు పెట్టింది. ఆ తర్వాత 2022 మార్చిలో వీటిని ఎత్తివేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పైనా ఈ మధ్యే కొరఢా ఝుళిపించిన సంగతి విదితమే. ఇదిలావుంటే వచ్చే నెల 4న గత ఆర్థిక సంవత్సరానికి (2023-24), చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను కొటక్ మహీం ద్రా బ్యాంక్ ఆడిట్ చేసిన ఏకీకృత, స్టాండలోన్ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నది.