MSP | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మొన్నటివరకు పంటలను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అదే మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి. తమ పంటలను అమ్ముకునేందుకు నానా ఆగచాట్లు. మార్కెట్లలో పడిగాపులు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆందోళనలు, ధర్నాలు. ముఖ్యంగా పత్తి, మిర్చి, వేరుశనగ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.
మార్కెట్లకు తెచ్చిన పంటకు ఆశించిన ధర దక్కకపోవడం, మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పలు జిల్లాల్లో రైతులు తమ పంటలను కొనుగోలు చేయాలని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం మిర్చి రైతులు ఖమ్మంలో ధర్నా చేశారు. కేసముద్రం, మహబూబాద్ మార్కెట్లలో మిర్చి పంటను కొనుగోలు చేయకుండా అధికారులు, వ్యాపారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
వేరుశనగకు గిట్టుబాట ధర కల్పించాలంటూ అచ్చంపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో రైతులు రొడ్డెక్కారు. పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆదిలాబాద్లో రైతులు ఆందోళన చేశారు. పత్తికి మద్దతు ధర చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు. రైతుల ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతున్నది.
బోనస్ ధర ఏమైంది?
తాము అధికారంలోకి వస్తే రైతులు పండించే ప్రతి పంటను కొనుగోలు చేస్తామని, 10 రకాల పంటలకు మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.300 నుంచి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. కానీ, బోనస్ ధర ఇప్పటికీ అమలులోకి రాలేదు. కనీసం పంటలకు మద్దతు ధర కూడా దక్కడం లేదు. ఇప్పటికే ధాన్యానికి మద్దతు ధరపై ఆ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి నాలుక మడతేశారు.
ధాన్యం ధర మద్దతు ధరకు తక్కువ ఉంటేనే బోనస్ ఇస్తామని, మద్దతు ధర దక్కితే బోనస్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇదే విధంగా వ్యవహరించడం గమనార్హం. కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్ గురించి మాట్లాడకుండా, మద్దతు ధర కోసం కేంద్ర సంస్థలకు లేఖలు రాస్తున్నారు. అంటే బోనస్ ఇవ్వబోమని పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం మిర్చి, పత్తి, పసుపు పంటలకు బోనస్ కల్పిస్తే రైతులు పడుతున్న ఇబ్బందులు ఎంతోకొంత తీరుతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మొదలుపెట్టకపోవడం బాధాకరం.