హైదరాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): రైతుల నుంచి పత్తి కొనుగోలు విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కోతలు, కొర్రీలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ఈ ఏడాది కొనుగోలు లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోయాయి. వాస్తవానికి ఈ సీజన్లో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 28.29 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ లక్ష్యంగా పెట్టుకొన్నది. కానీ ఇప్పటివరకు కేవలం 16.06 లక్షల టన్నులనే కొనుగోలు చేసింది.
అంటే లక్ష్యం కన్నా 12.23 లక్షల టన్నుల పత్తిని తక్కువగా కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రైతులకు రూ.9,919 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇంత భారీ విలువైన పత్తిని రైతుల నుంచి సీపీఐ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దీంతో మమ అనిపించేసి మరో వారం రోజుల్లో కొనుగోలు గడువునే ముగించనున్నది. నిరుడు పత్తి కొనుగోలుతో పోల్చితే ప్రస్తుత కొనుగోలు భారీగా తగ్గడం గమనార్హం. 28.30 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, 21.01 లక్షల టన్నులను కొనుగోలు చేసింది.
లక్ష్యంలో 74.24 శాతం పత్తిని కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది 56.76 శాతానికే పరిమితమైంది. అంటే నిరుటితో పోల్చితే ఈ ఏడాది 17.48 శాతం తక్కువగా పత్తిని కొనుగోలు చేసింది. ఓవైపు సీసీఐ కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు రైతులకు బాసటగా నిలువాల్సిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి చూసిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పత్తి రైతులకు ఈ సీజన్ కష్టాలు, నష్టాలనే మిగిల్చింది. జిన్నింగ్ మిల్లుల్లోని కొనుగోలు కేంద్రాల ప్రారంభం నుంచి నేటి వరకు రైతులకు అన్నింటా ఇబ్బందులే. పత్తి కోతలు మొ దలైన దాదాపు నెల తర్వాత గానీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. జిన్నింగ్ మిల్లుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం.. రైతులను చాలాకాలం ఇబ్బందులకు గురిచేసింది. ఆ తర్వాత పత్తి రైతులకు సీసీఐ చుక్కలు చూపించింది.
ఈ సీజన్లో అకాల వర్షాలతో పత్తి తడిసిపోయి రంగు మారింది. దీంతో ఆ పత్తి కొనుగోలుకు సీసీఐ తిరస్కరించింది. తేమ శాతాన్ని, రంగు సాకుతో పత్తి కొనుగోలుకే నిరాకరించింది. దీంతో రైతులు చేసేదేమిలేక తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సిన దుస్థితిని కల్పించింది. మ ద్దతు ధర రూ.8,110 ఉండగా రైతులు రూ.6 వేలకే బయట విక్రయించారు. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
తేమ శాతం, కొనుగోలు పరిమితి నిబంధన లే పత్తి రైతులను నిండా ముంచాయి. ఇందులో ఒకటి 12శాతం తేమ నిబంధన. అప్పటికే అకాల వర్షాలతో పత్తి మొత్తం తడిసి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తేమ శాతం 12 వరకు ఉంటే కొనుగోలు చేస్తామని, లేకపోతే ఒక్క దూది పింజను కూడా కొనుగోలు చేసే ప్రసక్తేలేదని సీసీఐ తేల్చి చెప్పింది. తేమ శాతం 15-20 శాతం వరకు పెంచాలని రైతులు ఎంత మొత్తుకున్నా.. బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో ఓవైపు పత్తి తడిసి, మరోవైపు కొనుగోలుకు సీసీఐ నిరాకరించడంతో ఆ పత్తి క్రమంగా రంగుమారింది.
రైతులు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. ఎకరానికి కొనుగోలు పరిమితిలో కోతపెట్టింది. నవంబర్ మొదటి వరకు ఎకరానికి 11.74 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ.. ఆ తర్వాత దీన్ని 7 క్వింటాళ్లకు తగ్గించింది. వర్షాలతో దిగుబడి తగ్గిందని, అందుకే ఎకరానికి కొ నుగోలు పరిమితిని తగ్గించినట్టు సెలవిచ్చింది. మిగిలిన పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ ని రాకరించడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చింది.
ఈ సీజన్లో 8.73 లక్షల మంది రైతుల నుంచి సీసీఐ పత్తిని కొనుగోలు చేసింది. వీరిలో 2 నుంచి 3 లక్షల మందికి మించి రైతులకు గరిష్ఠ మద్దతు ధర రూ.8,110 దక్కలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కారణం తేమ పేరుతో కొర్రీలు పెట్టడమే. తేమ శాతానికి అనుగుణంగా మద్దతు ధరను విభజించింది. దీంతో రూ.7,786 నుంచి రూ.8,110 వరకు మద్దతు ధర నిర్ణయించింది.
ఇందులో 8 శాతం, ఆలోపు తేమ ఉంటే గరిష్ఠ మద్దతు ధర రూ.8,110 దక్కుతుంది. 9 శాతం తేమ ఉంటే రూ.8,029, 10 శాతానికి రూ.7948, 11శాతానికి రూ.7,867, 12 శాతం తేమ ఉంటే రూ.7,786 చొప్పున మద్దతు ధరగా నిర్ణయించింది. అకాల వర్షాలకు పత్తి తడిసిపోవడంతో అత్యధిక మంది రైతుల పత్తి 10-12 శాతమే వచ్చింది. కొన్ని చోట్ల తేమ తక్కువగా వచ్చినప్పటికీ సీసీఐ అధికారులు ఎక్కువగా చూపి రై తులకు అన్యాయం చేసినట్టు తెలిసింది.