మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో WELLS FARGO, UNITED WAY స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యాధునిక 36 పడకల భవనాన్ని మంత్రులు సత్యవతి రాథోడ్ ,ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో లభించే కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
గిరిజనులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఏరియా హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసుకున్నామని మంత్రి తెలిపారు. వెనుకబడిన ప్రాంతంలో వైద్య సౌకర్యాలు కల్పించిన స్వచ్ఛంద సంస్థలను మంత్రి అభినందించారు. ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో సేవ చేయడం వల్ల గొప్ప గుర్తింపు వస్తుందన్నారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అందరూ ఆలోచించాలి. ఏడేళ్ల కింద ఈ ప్రాంతం ఎలా ఉండేది. ఇపుడు ఎలా ఉంది? అని చూడాలన్నారు. గతంలో ఇక్కడ తాగునీటి, సాగునీటి, కరెంట్ కష్టాలు ఉండేవి. ఇపుడు ఈ ప్రాంతం సస్య శ్యామలం అయిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా బాగా పని చేసి ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.