వరంగల్ : భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తానని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం హన్మకొండ, వరగల్ జిల్లాల్లో ఎంపీ పర్యటించారు. భద్రకాళి ఆలయంలో అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ వేద పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. భద్రకాళి దేవస్థానంలో మాడ వీధుల గురించి పండితులతో చర్చించారు. అనంతరం ఖిలావరంగల్ లోని స్వయంభూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖుష్ మహల్లో పర్యటించి నిర్మాణ ప్రాముఖ్యాన్ని గైడ్ ద్వారా తెలుసుకున్నారు. 50 వ డివిజన్ విద్యుత్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ లో సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. కాజీపేట దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు దర్గా ఆవరణలో మొక్కలు నాటారు. బిషప్ చర్చి ప్రాంతంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలకు సౌకర్యార్థం పాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి జిల్లాలను విభజించడం జరిగిందన్నారు. విద్యుత్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగులు మొక్కలను దత్తత తీసుకొని పెంచడం సంతోషం అని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ నాగుర్ల వెంకన్న, రాష్ట్ర వికలాంగుల సంస్థ ఛైర్మెన్ వాసుదేవరెడ్డి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, రాష్ట్ర నాయకులు కేశవ్ రావు, సతీష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రీజ్వానా శమిమ్ మసూద్, డివిజన్ ఇంచార్జి అనిల్, కాజిపేట్ దర్గా పీఠాధిపతి ఖుస్రో పాషా, బిషప్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.