హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలనే కాదు పట్టణాలకూ నిధుల్లేవంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. పట్టణ ప్రగతి కింది చేపట్టిన వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్లు, ఎఫ్ఎస్టీపీలు, మోడ్రన్ దోబీఘాట్లు లాంటి కీలక పథకాలకు నిధుల విడుదలపై చేతులు ఎత్తేసింది. ఇప్పటికే సగానికిపైగా పూర్తి అయిన నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. పనులు ఆగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు కొంతలో కొంతైన విడుదల చేయాలని మున్సిపల్ ఈఎన్సీ, ఇతర ఇంజినీరింగ్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే తదుపరి పనులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఎక్కడి పనులకు అక్కడ బ్రేక్ పడ్డాయి. పట్టణాల రూపు రేఖలు మార్చాలనే ఉద్దేశంతో గత సీఎం కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావులు పట్టణ ప్రగతి కింద ప్రతి నెల పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలకు రూ.148 కోట్లు విడుదల చేశారు. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. దీంతో తెలంగాణ పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
అనేక అవార్డులను సాధించాయి. ఇతర దేశాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి ఇక్కడ పథకాలు చూసి వెళ్లారు. దేశమే అబ్బురపడే విధంగా తెలంగాణ పట్టణ ప్రగతిని నిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైసా నిధులు ఇవ్వడంలేదు. దీంతో మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలు, ఎఫ్ఎస్టీపీలు, ట్రీ పార్కులు, ఓపెన్ జీమ్లు ఇలా అనేక పథకాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పారిశుద్ధ్య నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. చెత్త సేకరణపై అధికారుల పర్యవేక్షణ లేక చెత్త వాహనాలు నిర్వహణ సరిగా ఉండడం లేదు. ఈ సారి ఎండలు తీవ్రంగా ఉండటం, హరితహారం మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో అనేక చోట్ల ఎండిపోతున్నాయి. ఇక సమీకృత మార్కెట్లు కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కానీ కొన్ని చోట్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. 141 మోడ్రన్ దోభీ ఘాట్లకుగాను దాదాపుగా 10 వరకు మోడ్రన్ దోభీ ఘాట్లు పూర్తి అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఆఖరు ప్రయాణం సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పట్టణంలో హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో వైకుంఠధామాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇవేవి ముందుకు కదలడంలేదు.