కోనరావుపేట, జూన్ 10: నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కనగర్తి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ అందెం మల్లారెడ్డి బీఆర్ఎస్ హయాంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను కాంట్రాక్టు పద్ధతిలో పూర్తిచేశారు.
భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20లక్షలను సంబంధిత అధికారులు విడుదల చేసింది. అయితే ప్లానింగ్ ప్రకారం భవన నిర్మాణానికి డబ్బులు సరిపోకపోవడంతోపాటు అదనంగా లక్షా 50వేలతో పనులు చేయించానని కాంట్రాక్టర్ వాపోయాడు. అదనపు పనులకు గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తామని అప్పటి పాలకవర్గం చెప్పినప్పటికి, ఇప్పటికీ చెల్లింపులు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసినట్టు తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు రావాల్సిన బిల్లులు చెలించాలని విజ్ఞప్తి చేశాడు.