హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) :నేషనల్ హెల్త్మిషన్(ఎన్హెచ్ఎం) పథకం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. జిల్లా, పీహెచ్సీ, సబ్సెంటర్ స్థాయి దాకా గ్రామాలలో ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్న ఈ ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు అందటం లేదని తెలిపారు. పేద, మధ్యతరగతి ఉద్యోగులైన వీరంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఏడు నెలల పీఆర్సీ బకాయిలు విడుదల చేస్తామని గతంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఉద్యోగుల జీతాలు చెల్లింపునకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, తగు న్యాయం చేయాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.