హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 43 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.58 మీటర్ల వద్ద నీరు ఉన్నది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు 3,20,351 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నుంచి 3,42,185 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో అధికారులు 16 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి ప్రాజెక్టులోకి 2.40 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 2.81 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇప్పుడు 588.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నిల్వసామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 308.1702 టీఎంసీల నీరు నిల్వ ఉంది.