హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సెలూన్లకు, ధోబీఘాట్లకు గత ప్రభు త్వం ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణతోపాటు పలువురు నాయకులు బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నాయీ బ్రాహ్మణులు ఎదురొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో నాయీబ్రాహ్మణ సమాజంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చినట్టు సంఘం నేతలు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడల రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.