నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్తోనే సుభిక్షంగా ఉంటుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడారు. తొమ్మిదిన్నరేండ్లల్లో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ఇలా ఏ రంగం తీసుకున్నా తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. రాజకీయాల కోసం ఎవరెన్ని మాట్లాడినా.. తెలంగాణ ప్రజలు కేసీఆర్నే విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో బీఆర్ఎస్దే విజయమని, రాష్ట్రంలోనూ కేసీఆర్ సర్కార్దే గెలుపని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ పార్టీలోనైనా చిన్న సమస్యలు సర్వసాధారణమని, కూర్చుని చర్చించుకుని, అందరూ సమన్వయంతో బీఆర్ఎస్ విజయం కోసం పనిచేయాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న తన అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులంతా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తాను గానీ, తన కుమారుడు అమిత్రెడ్డి గానీ పోటీకి సిద్ధమని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఘటనను రాజకీయం చేయడం తగదని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడం సహజమని, గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని గుత్తా సుఖేందర్రెడ్డి గుర్తు చేశారు.