హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం పనులు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావుతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పనులు మొదలుపెట్టారు. గురువారం ఢిల్లీకి వెళ్లిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఢిల్లీ మెట్రోపాలిటన్ అథారిటీ నుంచి అన్ని రకాల అనుమతి పత్రాలను స్వీకరించారు. టీఆర్ఎస్ భవన్ నిర్మాణ బాధ్యతలను ఎండీపీ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. గడువులోగా పార్టీ భవన నిర్మాణం పూర్తిచేయలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి వేముల చెప్పారు. పార్టీ భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
గత ఏడాది భూమి పూజ
ఢిల్లీలోని వసంతవిహార్లో సర్వే నంబర్ 2, 6లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి 1100 చదరపు మీటర్ల (1327 గజాలు) స్థలాన్ని టీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికోసం రూ.8.64 కోట్లను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు టీఆర్ఎస్ చెల్లించింది. స్థల కేటాయింపు, పత్రాలను స్వీకరించిన అనంతరం గత సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, తెలంగాణవాదులు హాజరై ఢిల్లీ పురవీధులను గులాబీమయం చేశారు.
మొదటి అంతస్థులో అధ్యక్షుడి చాంబర్
టీఆర్ఎస్ కార్యాలయాన్ని 22,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో, జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్, కార్యాలయ కార్యదర్శి, మేనేజర్, చాంబర్లతోపాటు మీటింగ్ హాల్ ఉంటుంది. మొదటి అంతస్థులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, కాన్ఫరెన్స్ హాల్, వెయిటింగ్ హాల్స్ ఉండేలా ప్లాన్చేశారు. రెండో అంతస్థులో డార్మెటరీ రూములు, పార్టీ నేతలు బస చేసేందుకు ప్రత్యేక సూట్స్, మూడో అంతస్థులోనూ ప్రత్యేక గదులు, సూట్స్ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.