నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): చలో నల్లగొండ సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ప్రయత్నాలు, కుయుక్తులు విఫలమయ్యాయి. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన వెంటనే నల్లగొండలో తిరగనివ్వం.. అడ్డుకుంటామని ప్రకటన చేశారు. ఆ వెంటనే జిల్లాలో 30, 30(ఏ) సెక్షన్లు అమలు చేస్తున్నట్టు పోలీస్ శాఖ ప్రకటించింది. దాంతో సభ నిర్వహణకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ నేతలు లేఖ అందజేస్తే రెండు రోజుల సుదీర్ఘ సమాలోచనల తర్వాత పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు సోమవారం కేసీఆర్ నల్లగొండకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల పేరుతో హైడ్రామా సృష్టించారు.
మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు క్లాక్టవర్ సెంటర్లో ఖాళీ కుర్చీ వేసి అందులో కేసీఆర్ చిత్రపటం పెట్టి ఏదో చేయబోయారు. కానీ దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. నల్లగొండకు చేరుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఇంటిలో మధ్యాహ్న భోజనం ముగించుకుని సభా ప్రాంగణానికి బయల్దేరారు. మార్గమధ్యంలో పది మంది కూడా లేని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు బస్సుకు అడ్డం వచ్చి కోడిగుడ్లు విసిరేందుకు యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పక్కకు తప్పించారు. సభ ప్రకటించిన నాటి నుంచి ఏదో రకంగా బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించేందుకు కోమటిరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎటుచూసినా నల్లగొండ జనసంద్రంగా మారింది. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని పట్టణ ప్రజలు వ్యాఖ్యానించడం విశేషం.