హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేయాలన్న కుట్రలో భాగంగానే మేడిగడ్డ బరాజ్లో కుంగిన పియర్లకు మరమ్మతులు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వానకాలంలో వచ్చే వరదతో మిగిలిన పియర్లు కూడా కుంగిపోవాలని చూస్తున్నారనే అనుమానం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులు, బరాజ్లు, లక్షలాది రైతులకు మేలు చేసే వాటి మీద రాజకీయాలు మంచిది కాదన్నారు. తమపై కోపం ఉంటే రాజకీయంగా చూసుకుందామని, కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. గత రెండు వారాల్లో భువనగిరి, సూర్యాపేట గురుకులాల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం, మంత్రులు, అధికారులు ఎవ్వరూ స్పందించడంలేదని మండిపడ్డారు.
సీఎం ఢిల్లీకి సంచులు మోయడం, చక్కర్లు కొట్టడంలోనే బీజిగా ఉన్నారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. హామీలను అమలు చేయలేక ఎన్నికల షెడ్యూల్ త్వరగా విడుదల కావాలని రేవంత్రెడ్డి కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటి మాత్రమే అమలు చేశారని, ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాలకు బస్సు సర్వీసులను తగ్గించారని మండిప డ్డారు. రాష్ట్రంలో రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, రైతుబంధు ఇవ్వలేదని, బోనస్ ఇవ్వలేదని, కరెంటు లేక రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, నియామకాల విషయంలో అన్ని పూర్తయ్యాక తామే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎన్నింటికి పరీక్షలు నిర్వహించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరు చెప్పారో వెల్లడించాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి బాల్క సుమన్ సవాల్ చేశారు. తమది సెక్యులర్ పార్టీ అని, కేసీఆర్ సెక్యులర్ నాయకుడని స్పష్టంచేశారు. పొత్తులపై బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్రెడ్డి ఎగిరెగిరి పడుతున్నారని, బీజేపీ వాళ్లే పత్రికల్లో రాయిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు భరత్కుమార్, పల్లె రవి పాల్గొన్నారు.