హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్… 39 సీట్ల వద్ద ఆగిపోయింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా, ఎంఐఎం మళ్లీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా సీపీఐ ఒక స్థానాన్ని గెలుచుకున్నది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ జారీచేసి, నవంబర్ 30న పోలింగ్ నిర్వహించిన విష యం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రాత్రి 8 గంటల వరకు కూడా పలు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. 2018 ఎన్నికలతో పోల్చితే బీఆర్ఎస్కు 49 సీట్లు తగ్గగా కాంగ్రెస్కు 45 సీట్లు అధికంగా వచ్చాయి. అదే సమయంలో బీజేపీకి 7 సీట్లు అధికంగా వచ్చాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 19, బీజేపీ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించాయి.
క్షణక్షణం ఉత్కంఠ
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసాంతం ఉత్కంఠగా సాగింది. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగ్గా, మరికొన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు సాగింది. రౌండ్ రౌండ్కు ఆధిక్యంలో మార్పు కనిపించింది. కొన్ని రౌండ్లలో ఒక పార్టీకి ఆధిక్యం వస్తే.. మరికొన్ని రౌండ్లలో మరో పార్టీకి మెజార్టీ వచ్చింది. పలు నియోజకవర్గాల్లో మూడు పార్టీల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగిన నియోజకవర్గాల్లో చేవెళ్ల, కరీంనగర్, సూర్యాపేట, మహేశ్వరం, ఆదిలాబాద్, కామారెడ్డి, బాల్కొండ, బోధన్, దేవరకద్ర, గద్వాల, సంగారెడ్డి, స్టేషన్ ఘన్పూర్, మెదక్, పటాన్చెరు, జూబ్లీహిల్స్, జుక్కల్, కోరుట్ల, నాంపల్లి, సిర్పూర్, తాండూర్, అలంపూర్ ఉన్నాయి. ఈ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. గెలిచినవారికి 5వేల లోపు మాత్రమే మెజార్టీ రావడం గమనార్హం. జుక్కల్లో కేవలం 800 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీకాంతరావు గెలుపొందారు.
కాంగ్రెస్ కీలక నేతల ఓటమి
కాంగ్రెస్లో కీలక నేతలుగా పేరున్నవారిలో చాలా మంది విజయం సాధించారు. రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వంటి వారంతా విజయం సాధించగా, కొందరు సీనియర్ నేతలు ఓటమిపాలయ్యారు. ఆ జాబితాలో షబ్బీర్ అలీ, పొదెం వీరయ్య, మధుయాష్కీగౌడ్, జీవన్రెడ్డి, జగ్గారెడ్డి, ఆర్ దామోదర్రెడ్డి, అంజన్కుమార్యాదవ్ ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఎల్బీనగర్కు మారిన మధుయాష్కీగౌడ్ 83,157 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. కామారెడ్డి నుంచి నిజామాబాద్ అర్బన్కు మారిన షబ్బీర్ అలీ 15,387 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జగ్గారెడ్డి 9,297 ఓట్ల తేడాతో, జీవన్రెడ్డి 15,585 ఓట్ల తేడాతో ఓడిపోయారు.