హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కనీసం 15 లోక్సభ స్థానాలను గెలవాలని ఏఐసీసీ, 14 సీట్లు గెలిచితీరుతామని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అటు ఏఐసీసీ ఆశాభావం, ఇటు పీసీసీ ధీమాకు తగినట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్లాష్ సర్వేలో తేలినట్టు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ 14-15 సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదని ఆ సర్వే తేల్చినట్టు చెప్తున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే మెజార్టీ సీట్లు గెలిచే పరిస్థితి లేదన్న సమాచారం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్కు గురిచేసింది. దీంతో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ హుటాహుటిన హైదరాబాద్కు పరుగెత్తుకొచ్చి పీసీసీ నాయకత్వం, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జీలు, అభ్యర్థులతో సమావేశమైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వం పట్ల ప్రజలలో, ముఖ్యంగా రైతులలో తీవ్ర వ్యతిరేకతకు కారణం ఏమిటని కేసీ వేణుగోపాల్ ఆరా తీసినట్టు ఈ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడమే ప్రజలలో వ్యతిరేకతకు కారణమని అధిష్ఠానం గుర్తించింది. సునీల్ కనుగోలు టీమ్ తాజాగా ఎంపీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్లాష్ సర్వే నివేదికలోనూ అదే తేలినట్టు సమాచారం.
దీంతో ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏర్పడిన వ్యతిరేకతను ఏ విధంగానైనా అధిగమించి మెజార్టీ స్థానాలు గెలిచితీరాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, ఎంపీ సెగ్మెంట్లకు ఇన్చార్జీలుగా ఉన్న మంత్రులు, ఇతర నేతలను వేణుగోపాల్ ఆదేశించారు. ఉత్తరాది కంటే దక్షిణాదిలో అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణతోపాటు తమిళనాడులో డీఎంకేతో పొత్తుతో, కేరళలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్నది అధిష్టానం టార్గెట్ అని వేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వానికి వివరించారని తెలిసింది.
ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత
తమ అంచనాలకు భిన్నంగా తెలంగాణలో ప్రభుత్వం పట్ల ప్రజలలో అప్పుడే ఎందుకు వ్యతిరేకత వచ్చింది? అందుకుగల కారణాలు ఏమిటో గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడితే తప్ప మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదని కేసీ వేణుగోపాల్ వివరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ప్రజలలో విశ్వాసం సన్నగిల్లడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా అమలు చేయడమే ప్రధాన కారణమని సర్వేలో తేలిన విషయాన్ని కూడా రాష్ట్ర నాయకత్వానికి వివరించినట్టు తెలిసింది.
దీనికి తోడు సీఎం రేవంత్రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు మధ్య సమన్వయ లోపం, రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు, ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వం నుంచి రైతన్నలకు భరోసా కల్పించకపోవడం, మంచినీటి ఎద్దడి తదితర అంశాలు ప్రజలలో వ్యతిరేకతకు కారణమని అధిష్ఠానానికి అందిన నివేదికను వేణుగోపాల్ వివరించినట్టు తెలిసింది.
వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే, అధికారంలో ఉన్నాం కాబట్టి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని, అసెంబ్లీ ఎన్నికలప్పటి పట్టుదల, ఉత్సాహం పార్టీ నాయకత్వంలో, శ్రేణులలో కొరవడిందని ఈ ప్రభావం ఎంపీ ఎన్నికలపై పడే ప్రమాదం లేకపోలేదని అధిష్ఠానం హెచ్చరించినట్టు సమాచారం.
మరోవైపు పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, పాత వారికి మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని, అందుకు సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాలే ఉదాహరణ అని ఆయన గుర్తు చేసినట్టు తెలిసింది. ఈ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా బరిలోకి దిగిన దానం నాగేందర్, సునీతా మహేందర్రెడ్డి, రంజిత్రెడ్డి ప్రచారంలో ప్రత్యర్థుల కంటే వెనకబడి ఉన్నారని గుర్తు చేసినట్టు సమాచానం.
అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలుచుకోలేదని, ఆ లోటును తీర్చడానికి ఈ మూడు ఎంపీ స్థానాలను ఎట్టి పరిస్థితులలో గెలిచితీరాల్సిందేనని వేణుగోపాల్ ఆదేశించినట్టు తెలిసింది. ఇక్కడి నుంచి పోటికి పార్టీ నాయకులు ఆసక్తి చూపినప్పటికీ వారిని పక్కన పెట్టి టికెట్ ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని ఆయన దానం నాగేందర్, రంజిత్రెడ్డి, సునీతా మహేందర్రెడ్డికి గుర్తు చేసినట్టు తెలిసింది.
రెఫరెండం మాట ఎత్తడం లేదు
ఈ లోక్సభ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండం అంటూ పలుమార్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి, తాజాగా ఆ మాటే ఎత్తడం లేదు. పైగా పేదోడి బిడ్డ సీఎం కావద్దా? ఒక రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు, తనను గద్దె దించడానికి ఇటు కేసీఆర్, అటు మోదీ గొడ్డలి భుజాన వేసుకొని తిరుగుతున్నారంటూ ప్రజలలో సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం నారాయణపేటలో జరిగిన జనజాతర సభలో స్పష్టమైంది. ఇది ప్రజల సానుభూతి పొందడంతోపాటు అంతకుముందు రెఫరెండం అన్న దాని నుంచి ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
తాజా సర్వే హెచ్చరికతో దిద్దుబాటు చర్యలు
తాజా సర్వే నివేదిక ప్రకారం ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను అధిగమించి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకునే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి రంగంలోకి దిగారు. రైతులలో వ్యతిరేకతకు కారణమైన రూ.2 లక్షల రుణ మాఫీని ఎన్నికల కోడ్ కారణంగా సకాలంలో చేయలేకపోయామని, ఎన్నికలు ముగిశాక ఆగస్టు 15 కల్లా ఒకేదఫాలో అమలు చేస్తామని నారాయణపేటలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం దిద్దుబాటు చర్యలలో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అలాగే ఇందిరమ్మ ఇండ్లు, రైతులు పండించే ధాన్యానికి రూ. 5 వందల బోనస్ వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తామని కూడా సీఎం ప్రకటించారు. వీటిని కూడా ఎన్నికల కోడ్ కారణంగా వెంటనే చేపట్టలేకపోయినట్టు సీఎం వివరించారు. పార్టీ క్యాడర్లో అసెంబ్లీ ఎన్నికలప్పటి జోష్ కొరవడినట్టు సర్వేలో తేలడంతో వారిని ఉత్తేజపరిచేందుకు ఎంపీ ఎన్నికలలో కష్టపడి పనిచేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. మొత్తం మీద అధికార కాంగ్రెస్ పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతను అధిగమించి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది.