ఐదు గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారు.. కాంగ్రెస్ను గెలిపిస్తే ఉచిత కరెంటు ఇస్తామని ఊదరగొట్టారు.. ఆర్థిక సాయమంటూ మహిళలకు మాయమాటలు చెప్పారు.. ఆడబిడ్డలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమంటూ ఊరించారు.. భృతి ఇస్తామంటూ నిరుద్యోగులతో నిబ్బరంగా మాట్లాడారు.. ఉచిత బియ్యమంటూ పేదలకు పెద్దపెద్ద మాటలే చెప్పారు..
భస్మాసుర ‘హస్తం’ పార్టీ జిత్తులు తెలియని అమాయక కన్నడ ఓటర్లు కాంగ్రెస్ను గెలిపించారు.
ఆరు నెలలు గడిచింది.. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్క గ్యారెంటీని సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం..
ఉచిత కరెంటు అంటూ ఊదరగొట్టిన ‘గృహజ్యోతి’కి గ్రహపాట్లు మొదలయ్యాయి మహిళలకు ఆర్థికభరోసానిస్తామన్న ‘గృహలక్ష్మి’కి పైసల కటకట షురూ అయ్యింది ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్ శక్తివిహీనమైంది. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’ ఉత్తనిధిగానే మారిపోయింది. పేదలకు ఉచిత బియ్యమని ఊదరగొట్టిన ‘అన్నభాగ్య’ అతీగతిలేకుండా తయారైంది. ఇచ్చినా హామీలన్నీ సంపూర్ణంగా చేయలేదు.
గద్దెనెక్కే వరకూ ఇదిచేస్తాం.. అది చేస్తామంటూ ఊదరగొడతారు. గ్యారెంటీల పేరిట మభ్యపెడతారు. ఆదమరిచి అధికారాన్ని అప్పగించామా?? నట్టేట మునుగుడే. ఇదీ కాంగ్రెస్ అసలు స్వరూపం.
Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ 40 శాతం కమీషన్రాజ్ సర్కారుతో విసిగిపోయిన కర్ణాటక ప్రజల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ‘5 గ్యారెంటీ ప్రకటనలు’ చూసి ఆశపడ్డ కన్నడిగులకు, మబ్బుల్లో నీళ్లుజూసి ముంత ఒలకబోసుకొన్న దుస్థితి దాపురించింది. ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తుందనుకొన్న కాంగ్రెస్.. ప్రజలకు రిక్తహస్తాన్ని చూపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదని ఏకంగా సీఎం సిద్ధరామయ్యనే పదుల సంఖ్యలో మహిళలు నిలదీశారంటే హామీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏమిటో అర్థంచేసుకోవచ్చు.
5 గ్యారెంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఈ స్కీమ్లను అమలు చేయాలంటే ఎన్ని నిధులు అవసరమైతాయి? ఏ విధంగా ముందుకు పోవాలన్న దానిపై ప్రభుత్వం పెద్దగా కసరత్తు చేయలేదని, ఎగ్గొట్టాలన్న ఉద్దేశం ఉండటంతోనే ఈ విధంగా ప్రభుత్వ వైఖరి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 5 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా ప్రభుత్వ ఖజానాపై రూ.62 వేల కోట్లకు పైగా భారం పడుతుంది. మొత్తం బడ్జెట్లో ఇది దాదాపు 20 శాతంతో సమానం. దీంతో కాంగ్రెస్ వెనుకడుగు వేసినట్టు మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 5 గ్యారెంటీలతో అరచేతిలో వైకుంఠంచూపించి తమను కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని అర్థమైపోవడంతో కన్నడ ప్రజలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో గెలిపిస్తే అదనంగా మరోటి కలిపి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మితే గోస తప్పదని తెలంగాణ ప్రజానికాన్ని హెచ్చరిస్తున్నారు.
ఏం చెప్పారు: మహిళలకు ఆర్టీసీ బస్సులో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.
ఇదీ పరిస్థితి: ‘శక్తి’ స్కీమ్కు నిధుల కటకట మొదలైంది. పథకం అమలు కోసం సిద్ధరామయ్య సర్కారు బడ్జెట్లో రూ.2,800 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ఈ నిధులను వినియోగించనున్నట్టు వెల్లడించింది. అయితే, గత అదివారం నాటికి ‘శక్తి’ స్కీమ్ కోసం ఉద్దేశించిన బడ్జెట్లో రూ.2,143 కోట్లు ఖర్చయినట్టు అధికారులు చెప్తున్నారు. మిగతా నిధులతో వచ్చే డిసెంబర్వరకు మాత్రమే బస్సులు నడిపించగలమని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గనుక వెంటనే నిధులు విడుదల చేయకపోతే, బస్సులు నడుపడమే కష్టమని తేల్చిచెప్తున్నారు.
‘శక్తి’ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత బస్సుల్లో మహిళల ప్రయాణాలు తగ్గుతాయని కాంగ్రెస్ సర్కారు తప్పుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి మహిళలు ఫ్రీ బస్సులను వినియోగిస్తుండటంతో డీజిల్ మోత మోగింది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలకు దిగింది. అనేక మార్గాల్లో బస్సు సర్వీసులను నిలిపేసింది. గతంలో 5-10 నిమిషాలకు వచ్చే ఒక్కో బస్సు, ఇప్పుడు 40 నిమిషాలకు కూడా రావట్లేదని ‘ది హిందూ’ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో మహిళలు మండిపడ్డారు. ఇక, శక్తి స్కీమ్ కారణంగా తమ వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య తక్కువైందని ఆటో రిక్షాలు, క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమ ఉపాధికి గండిపడేలా చేసిన సర్కారే నెలకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ సర్కారు తలపట్టుకొంటున్నది.
ఏం చెప్పారు: పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా గృహ వినియోగదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ పరిస్థితి: ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామన్న కాంగ్రెస్.. సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2.14 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందనుకొన్న ఈ స్కీమ్, కొత్త ఆర్థిక కష్టాలను తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 2022 నుంచి 2023 మార్చి వరకు గృహ విద్యుత్తు వినియోగం సగటున 200 యూనిట్లకు మించని కుటుంబాలు మాత్రమే ఈ స్కీమ్కు అర్హులంటూ సర్కారు తొలి షాక్ ఇచ్చింది. గృహ విద్యుత్తు వినియోగదారుడు గత సంవత్సరం సగటున 150 యూనిట్ల విద్యుత్తు వినియోగించినట్టయితే, దానికి అదనంగా 10 శాతం కలిపి (15 యూనిట్లు) మొత్తంగా 150+15=165 యూనిట్లుగా లెక్కిస్తారు. అంటే, 200 యూనిట్ల స్థానంలో 165 యూనిట్లను కటాఫ్గా మార్చేస్తారు.
ఈ 165 యూనిట్లనే ప్రామాణికంగా తీసుకొని అంతవరకు మాత్రమే ఉచితంగా పరిగణించి 166వ యూనిట్ నుంచి ఎంత వినియోగిస్తే అంత మొత్తానికి బిల్లు (యూనిట్కు రూ. 7 చొప్పున) చెల్లించాల్సిందే. కొత్తగా కనెక్షన్ తీసుకొన్న వారికి 59 యూనిట్ల వరకు మాత్రమే మినహాయించి 60 యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు రూ.5.6 చొప్పున.. వంద దాటితే యూనిట్కు రూ.7 చొప్పున బిల్లు విధిస్తారు. ఉచిత విద్యుత్తు స్కీమ్లో మరో మాయాజాలం ఏమిటంటే, ప్రభుత్వం ఉచితంగా ప్రకటించిన 200 యూనిట్లకు ఒక్క యూనిట్ (201) అదనంగా కాల్చినా గృహృజ్యోతి పథకం వర్తించదు. ప్రభుత్వం విధిస్తున్న కొత్త కొర్రీలతో గతంలో వచ్చే బిల్లు కంటే మూడింతలు ఎక్కువగా బిల్లు వస్తున్నదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుడికి పెండింగ్ బిల్స్ ఉంటే ఈ పథకానికి అర్హులు కారు అని ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఇలా సవాలక్ష కొర్రీల అనంతరం.. ఉచిత విద్యుత్తు పథకానికి అక్టోబర్ నెలాఖరు నాటికి 8 లక్షలు మాత్రమే అర్హులుగా మిగిలారు. విద్యుత్తు కోతలతో ఈ లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నది.
ఏం చెప్పారు: డిగ్రీ పాసైన యువతకు నెలకు 3 వేలు, డిప్లొమా చేసినవారికి 1,500 భృతిగా ఇస్తామన్నారు.
ఇదీ పరిస్థితి: గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి నెలకు రూ.3 వేలు, డిప్లొమా చేసినవారికి (18-25 ఏండ్లు) రూ.1,500 నిరుద్యోగ భృతిగా చెల్లిస్తామని కాంగ్రెస్ హామీనిచ్చిం ది. రెండేండ్లపాటు ఈ భృతి ఉంటుందని చెప్పింది. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఈ స్కీమ్ ప్రారంభంకాలేదు. నిరుద్యోగుల లెక్కలు తెలియాల్సి ఉన్నదని, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు ఇందులో లబ్ధి పొందే ప్రమాదమున్నదని, ఉద్యోగనోటిఫికేషన్లు ఇస్తామంటూ కాలయాపన చేసింది. రెండేండ్ల కాలపరిమితిలో ఇప్పటికే 6 నెలలు గడిచిపోవడం, ఉద్యోగ నోటిఫికేష న్లు జారీ చేయకపోవడం, భృతిని ఇవ్వకపోవడం వెరసి కాంగ్రెస్ సర్కారు మోసాన్ని గ్రహించిన నిరుద్యోగులు నిరసనలు ఉద్ధృతం చేస్తున్నారు. భృతి ఇస్తామంటూ కాంగ్రెస్ తమని మోసం చేసిందంటూ నిరుద్యో గులు మండిపడుతున్నారు.
ఏం చెప్పారు: పేదింట ప్రతీ వ్యక్తికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం సరఫరా చేస్తామన్నారు.
ఇదీ పరిస్థితి: అధికారంలోకి వచ్చీరాగానే స్కీమ్ ప్రారంభిస్తున్నామంటూ ప్రకటించిన సర్కారు.. ఉచిత బియ్యాన్ని సరఫరా చేయడంలో మాత్రం చేతులెత్తేసింది. బియ్యం దొరకటంలేదంటూ గగ్గోలు మొదలుపెట్టింది. 10 కిలోల బియ్యంలో కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యం వాటాను అటుంచి.. మిగతా 5 కిలోల బియ్యానికి బదులు నగదును జమ చేస్తామని చెప్పుకొచ్చింది. అర్హులైన ఒక్కో వ్యక్తికి నెలకు రూ. 170 జమ చేస్తున్నట్టు వెల్లడించింది. అంటే కిలో బియ్యానికి రూ.34ను చెల్లిస్తున్నదన్న మాట. అయితే, బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ. 60పైనే ఉన్నదని, ప్రభుత్వం ఇచ్చే రూ. 170తో నెలంతా ఎలా బతుకగలమని పేద, మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయిందని ధ్వజమెత్తుతున్నారు.
ఏం చెప్పారు: ప్రతీ ఇంట్లో మహిళా యజమానికి నెలకు రూ.2 వేలు.
ఇదీ పరిస్థితి: కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకూ ఈ స్కీమ్ను సంపూర్ణంగా అమలుచేసిన దాఖలా లేదు. స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్థిక భరోసా లభిస్తుందని ఊదరగొట్టిన హస్తం పార్టీ పెద్దలు, వందల సంఖ్యలోనే.. అదీ ఒక్క నెల మాత్రమే డబ్బులు జమచేశారు. పథకం లబ్ధిదారులు కావాలంటే, విధిగా తమ వివరాలు, డాక్యుమెంట్లతో సేవా సింధు, గ్రామ వన్, బెంగళూర్ వన్, కర్ణాటక వన్ వెబ్ పోర్టల్ ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ వివిధ పోర్టల్స్ ద్వారా 1.3 కోట్ల మంది మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి రిజిస్ట్రేషన్ నంబర్లతో ఫోన్లకు మెసేజీలు కూడా వచ్చాయి. అయితే, డబ్బులు మాత్రం వందల మందికి మాత్రమే జమయ్యాయి. అదీ ఒక్క నెల మాత్రమే. స్కీమ్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ఏటా రూ.32 వేల కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికే ఆరేడు నెలలు గడిచిపోయినందున ఇప్పటికిప్పుడు స్కీమ్ను కొనసాగించాలంటే కనీసం రూ.18 వేల కోట్లయినా అవసరమని అధికారులు చెప్తున్నారు. అయితే, ఆ స్థాయిలో నిధులు లేవని అర్థమవుతున్నది. ఈ పథకం కోసం మహిళలు సీఎం సిద్ధరామయ్యతోనే వాగ్వాదానికి దిగడం ఇటీవల సంచలనమైంది.