హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్నది. ఎల్ఐసీ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టే బదులుగా కేంద్రాన్ని నిలదీయాలని ఆ పార్టీని డిమాండ్ చేసింది.
ఈ మేరకు క్లాస్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ల సమా ఖ్య ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, ఎన్ఎఫ్ఐఎఫ్డబ్ల్యూఐ ప్రధాన కార్యదర్శి వివేక్ సింగ్, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా, ఏఐఎల్ఐసీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజేశ్కుమార్ తదితరులు శనివారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నియంతృత్వ ధోరణితో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నదని, ఎల్ఐసీని అదానీకి కట్టబెట్టాలని చూస్తున్నదని పేర్కొన్నారు.