సంగారెడ్డి, జూలై 12(నమస్తే తెలంగాణ) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుస్తుందని.. సీఎం రేవంత్రెడ్డి ఇది రాసిపెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో అబద్ధాలు, మాయమాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు పసిగట్టారని తెలిపారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే ఇప్పుడు ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం రావటం ఖాయమని, ప్రజలు కూడా బీఆర్ఎస్ గెలుపును కోరుకుంటున్నట్టు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పదికి పది ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుందని తెలిపారు. ఆదివారం పటాన్చెరులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలకు ‘సర్’పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి లేవనెత్తే ప్రతి అంశం, బీఆర్ఎస్పై ఆరోపణలు, విమర్శలకు ‘ఈట్కా జవాబ్ పత్తర్’లా ఇస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సత్తాచాటడం ఖాయమని చెప్పారు. ‘సర్’ విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు అలసత్వం వీడాలని హెచ్చరించారు. ప్రతి బూత్ వద్ద ఉంటూ తమ పో లింగ్స్టేషన్ పరిధిలోని ఎన్యుమరేషన్ పత్రాలు నింపి ఇచ్చేలా చూడాలని సూచించారు.
రేవంత్ సర్కార్ భూమి శిస్తు తీసుకొస్త్తుందట
నాడు ప్రజలు జుట్టు పెంచితే ఔరంగజేబు శిస్తు వేశాడని.. ఇప్పుడు రేవంత్రెడ్డి భూమిశిస్తు వేస్తూ రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రూ.30వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్భూములను అమ్మేశారని విరుచుకుపడ్డారు. పటాన్చెరు సమీప ఉస్మాన్నగర్లో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 200 ఎకరాలు సేకరిస్తే ఆ భూములను అమ్ముకున్నారని నిప్పులుచెరిగారు. కమీషన్ల కోసమే రేవంత్రెడ్డి లక్షల కోట్లతో ఫ్యూచర్సిటీ, మూసీ సుందరీకరణ పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు.