తరిగొప్పుల : కాంగ్రెస్ పాలనలో సాగునీరు కరువై పంటలు సాగు చేసిన రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపూర్కు చెందిన రైతు సంగ మల్లికార్జున్ తన రెండెకరాల్లో వరి వేశాడు. భూగర్భ జలాలు అడుగంటడటంతో బోరు నుంచి నీరు రాక పొలం ఎండిపోతున్నది. చేతికొచ్చే పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పంటను తడుపుతున్నాడు. ఎకరం పొలానికి పది ట్యాంకర్లు పడుతున్నాయని, కండ్లెదుటే పంట ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతున్నదని విలపించాడు. రోజుకు రూ.వెయ్యి చొప్పున ట్యాంకర్ అద్దెకు తెచ్చి పది ట్యాంకర్లు కోసం రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశాడు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ప్లాట్లు ఇచ్చిన తర్వాతే కూరగాయల మార్కెట్ భవనం నిర్మించాలని సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి, చిన్న తిమ్మాపూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం వంటిమామిడి కూరగాయల మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. కూరగాయాల మార్కెట్ రాజీవ్ రాహదారిపై ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని మరోచోటుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలోనే సుమారు 82 ఎకరాలను సేకరించారు. అప్పట్లోనే పరిహారం ఇచ్చిన అధికారులు ప్రతి రైతుకు ఓపెన్ ప్లాట్ ఇస్తామని హామీ ఇచ్చినా నెరవేర్చలేదు. శనివా రం రైతుల నుంచి సేకరించిన భూమిలో జేసీబీల సాయంతో భూ మిని చదును చేస్తున్న విషయం తెలుసుకొని రైతులు ధర్నా చేశారు.
– గజ్వేల్

మిల్లర్ల దోపిడీని అరికట్టడంతోపాటు పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని రైతులు శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఆందోళనకు దిగారు. కోదాడ పరిధిలోని తమ్మర రైతులు, రైతు సంఘాల నాయకులు ఎంవీఐ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ ధాన్యాన్ని స్థ్ధానిక మిల్లులకే కేటాయించాలని, దూరప్రాంత మిల్లులకు వద్దని కోరారు. మిల్లర్లు తేమ పేరుతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.
– కోదాడ రూరల్