Rahul Gandhi | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ)/ఆర్కే పురం: బుధవారం సాయంత్రం 6 గంటలు.. హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ.. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంటరీ నియోజవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ బలప్రదర్శనకు బహిరంగ వేదిక. వచ్చింది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అభ్యర్థి, పార్టీ జాతీయ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ. ఆయన అక్కడికి వచ్చే లోగా సభ నిండలేదు. పట్టుమని 100మంది కూడా అక్కడ లేరు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. జనం లేరన్న విషయం తెలుసుకున్న రాహుల్ బయటే ఆగిపోయారు. కారవాన్ కూడా దిగలేదు. కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. తత్తరబిత్తర అయిపోయి, ఎవరికి వారు పురమాయింపుల్లోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా వ్యాన్ దిగి, రోడ్డుమీదికి వచ్చారు. స్టేడియం గేటు వద్ద నిలబడి ప్రజల్ని లోపలికి పంపే పనిలోకి దిగారు.
అప్పుడే డీసీఎం దిగుతున్న ప్రజలను ‘లోపలికి పదండి..’ అంటూ పురమాయించారు. భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడున్న వారిని స్టేడియం లోపలికి పంపుతూ కనిపించారు. ఇట్లా ‘జనసమీకరణ’ 45 నిమిషాలపాటు సాగింది. అంతసేపూ సీఎం రేవంత్ రోడ్డుపైనే వేచి చూశారు. రాహుల్గాంధీ కారవాన్లోనే ఉండిపోయారు. చివరకు 7.10 గంటలకు రాహుల్ వేదిక మీదికి వచ్చారు. ఎట్టకేలకు కొంతమంది జనం రావడంతో సభ మొదలైంది. బహిరంగ సభ ముగిసే సమయానికీ మైదానంలో రెండు వేల మంది కూడా లేరు. రాహుల్కూడా నిరాసక్తంగా కనిపించారు. 16 నిమిషాల్లోనే ఆయన తన ప్రసంగం ముగించారు. ఎలాగోలా సభ ముగియడంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికే రాజకీయవర్గాల్లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్లో కలవరం మొదలైంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం.. అందునా 14 సీట్లు గెలుస్తున్నామంటూ ముఖ్యమంత్రే చెప్పుకుంటూ తిరుగుతున్న వేళ.. సరూర్నగర్ సభ అట్టర్ఫ్లాప్ కావడం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడుపడని పరిణామంగా మారింది. పార్టీ రాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా రోడ్డుమీదికి వచ్చి జన సమీకరణకు దిగడంతో.. కాంగ్రెస్ శ్రేణులు నివ్వెరపోయాయి. పార్లమెంటు ఎన్నికలపై అంతోఇంతో ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిస్తేజం ఆవరించింది. ఇటీవల చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని బాలాపూర్లో సీఎం రేవంత్రెడ్డి కార్నర్ మీటింగూ జనం లేక వెలవెలబోయింది. కానీ, ఈసారి దానిని మించి.. అదీ రాహుల్గాంధీ సభకు ఈ తరహా ప్రజావ్యతిరేకతను కాంగ్రెస్ నాయకులు ఊహించలేకపోయారు. దీంతో.. రాహుల్ ముందే రాష్ట్ర కాంగ్రెస్ పరువు గంగలో కలిసినట్టయ్యిందని వాపోయారు. జనసమీకరణలో విఫలం కావడంపై సభా వేదిక వద్ద నేతల మీద రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి.. మూడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో గురువారం రాహుల్గాంధీ సభను ఏర్పాటు చేశారు. భారీ వేదికతోపాటు మైదానం నిండా కుర్చీలు వేశారు. ఈ సభ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు ఎంపీ అభ్యర్థులు రంజిత్రెడ్డి (చేవెళ్ల), సునీతా మహేందర్రెడ్డి (మల్కాజిగిరి), కిరణ్కుమార్ రెడ్డి(భువనగిరి)తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు ముందుగానే వచ్చారు.
ఆ తర్వాత సరిగ్గా ఆరు గంటల సమయంలో రాహుల్గాంధీతో పాటు సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే రాజ్గోపాల్రెడ్డి, నేతలు అంజన్కుమార్ యాదవ్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికి సభా ప్రాంగణంలో కనీసం వంద మంది కూడా లేని పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియక రాహుల్గాంధీ తన వాహనంలోనే ఉండిపోయారు. రేవంత్రెడ్డి పరిస్థితిని గుర్తించి… స్టేడియం వెలుపలికి వెళ్లి ప్రజలు సభా ప్రాంగణంలోకి వెళ్లేలా పురమాయించారు. పైగా వస్తున్న డీసీఎంల్లో కూడా పలుచగా వచ్చే జనాన్ని వెంటనే స్టేడియం లోపలికి వెళ్లేలా సీఎం, ఇతర నేతలు, పోలీసులు సూచనలు చేస్తూ వచ్చారు.
సభా ప్రాంగణానికి వచ్చిన రాహుల్గాంధీ ఏకంగా 45 నిమిషాల పాటు ప్రజల కోసం వేచి చూశారు. కానీ పెద్దగా ప్రజలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎట్టకేలకు సాయంత్రం 7.10 గంటలకు రాహుల్ సభా వేదికపైకి వచ్చారు. అప్పటికీ ప్రాంగణంలో కుర్చీలన్నీ దాదాపుగా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక లాభం లేదనుకుని వెంటనే సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది మహిళలు వెనక్కి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో రేవంత్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి… రాహుల్గాంధీ మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో రాహుల్ కూడా తన ప్రసంగాన్ని త్వరగానే ముగించారు. దీంతో సభకు వచ్చిన కాంగ్రెస్ నేతల ముఖాల్లో నిరాశ, నిస్పృహలు కనిపించాయి. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల మధ్యలో ఉన్న ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కల భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున నివాసముంటారు. అయినప్పటికీ సభకు ప్రజలు రాకపోవడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీపై క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకతకు ఇదో నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాహుల్ సభలో ఖాళీ కుర్చీలు కనబడడం కన్నా.. ముఖ్యమంత్రి సహా నేతలందరూ రోడ్డుమీదికి వచ్చి ప్రజల్ని సభలోకి పంపేందుకు ప్రయత్నించడం చూసి అక్కడున్న పాత్రికేయులూ నివ్వెరపోయారు. చిన్న సభనూ నింపడానికి కాంగ్రెస్ నాయకులు ఆపసోపాలు పడటం వారిని విస్తుపోయేలా చేసింది. 3 పార్లమెంటరీ నియోజకవర్గాల సభ ముగిసేసరికి ముఖ్యనాయకులకు మూడు చెరువుల నీళ్లు తాగినంత పనైందని పలువురు అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్ ప్రచారఢంకా సరూర్నగర్ సభతో బద్దలైంది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో కనీసం ఒక్క సీటయినా గెలుస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల ఉమ్మి సభకు నాయకులు, అభ్యర్థులూ జనసమీకరణ చేయలేదా? లేక చేసినా జనం రాలేదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి’ అని సీనియర్ పాత్రికేయుడు ఒకరు చెప్పారు. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి పార్లమెంటరీ సెగ్మెంట్లలో ఈసారి కాంగ్రెస్ కథ ఒడిసినట్టేనని, ఆ పార్టీకి ఓటమి ఖాయమైనట్టుగా కనిపిస్తున్నదని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు.
రాహుల్గాంధీ సభకు జనం రాకపోవడంపై కాంగ్రెస్ నేతలు అనధికారిక సంభాషణల్లో వింత వింత కారణాలు చెప్పుకొచ్చారు. ‘సరూర్నగర్ ఇండోర్ స్టేడియం లోపలికి వెళ్లేందుకు మూడుదారులున్నాయి. ఇందులో రెండు దారులు సాధారణ ప్రజలకు, ఒక దారిని వీఐపీల రాకపోకలకు వినియోగిస్తారు. ఎన్నికల సమయంలో స్టేడియంను డీఆర్సీ సెంటర్గా వాడుతున్నారు. ఎన్నికల సామగ్రి ఉండడంతో పోలీసులు సామాన్య ప్రజలను ప్రధాన గేట్ నుంచి అనుమతించలేదు. ప్రజలను డాక్టర్స్ కాలనీ నుంచి వెళ్లమనడంతో సభకు వచ్చిన వారు లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి’ అని వారు సమర్ధించుకోచూశారు. మా పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న ఈ సమయంలో కనీసం జనం ఏ గేటునుంచి లోపలివెళ్లాలో కూడా పోలీసులతో చెప్పించుకోలేమా? అసలు కారణం అదికాదు అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ప్రజల రాక నెమ్మదిగా సాగుతుండడంతో సీఎం రేవంత్రెడ్డి స్టేడియం బయటకు వచ్చారు. ఆ సమయంలో కొందరు డీసీఎం నుంచి దిగుతున్నారు. సీఎం కాన్వాయ్ను స్టేడియం బయట ఆపి ప్రజలను తొందరగా లోపలికి వెళ్లేందుకు వీఐపీ గేట్ నుంచి అనుమతించినట్టు పోలీసులు చెప్పారు.
రాష్ట్రంలో ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు సరిగా లేకపోవడం ఒకవంతైతే.. సాగు, తాగునీరు, కరెంటు కోతలు ప్రజలను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టాయి. దీంతో కాంగ్రెస్పై ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇదే సరూర్నగర్ రాహుల్ సభలో ప్రతిబింబించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఏమీ ఇవ్వలేదని ‘గాడిద గుడ్డు’ బొమ్మతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే.. గ్యారెంటీల పేరుచెప్పి కాంగ్రెస్ కూడా తమకూ అదే ఇచ్చిందన్న భావనతో ప్రజలు ఉన్నారని, అందుకే కాంగ్రెస్ సభలకు స్పందన కొరవడిందని ప్రముఖ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల ఫలితాలకు జనం రాని రాహుల్ సభే నిదర్శనమని ఆయన చెప్పారు.
పోలింగ్కు నాలుగు రోజుల ముందు ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాహుల్ సభ అట్టర్ఫ్లాప్ కావడం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులపై ప్రభావం చూపుతుందని భావించిన నాయకత్వం నష్టనివారణకు దిగింది. సభ వైఫల్యం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించింది. సరూర్నగర్ సభ తర్వాత రాహుల్గాంధీ అప్పటికప్పుడు ఓ సిటీ బస్ ఎక్కారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనను అనుసరించారు. బస్సులో కాంగ్రెస్ కరపత్రాలను రాహుల్ ప్రయాణికులకు పంచిపెట్టారు. కొద్దిసేపటి తర్వాత బస్సుదిగి తిరిగి తన కారవాన్లోకి వెళ్లిపోయారు.
అది హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్స్టేడియం. అక్కడ కాంగ్రెస్ ఎన్నికల సభ.. ఒకటి కాదు రెండు కాదు. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు లోక్సభ నియోజవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ బలప్రదర్శనకు బహిరంగ వేదిక.
వచ్చింది ఆషామాషీ వ్యక్తి కాదు.. వచ్చింది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అభ్యర్థి, పార్టీ జాతీయ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మూడు నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు.
సభ 6 గంటలకు మొదలన్నారు. రాహుల్ సరిగ్గా ఆ సమయానికే స్టేడియం వద్దకు చేరుకున్నారు. కానీ, సభలో పట్టుమని కొన్ని డజన్ల మంది కూడాలేరు. దీంతో కాంగ్రెస్ ముఖ్యులు బిత్తరపోయారు. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి. రాహుల్ను కారవాన్లోనే కూర్చోబెట్టారు.
రాహుల్ దాదాపు గంటసేపు వ్యాన్లోనే జనం కోసం వేచిచుస్తూ ఉండిపోయారు.రాహుల్తో పాటే ఉన్న రేవంత్ వ్యాన్ దిగారు.. జనం ఎందుకు రాలేదు చెప్మా అని విస్తుపోయారు. అక్కడ ఉన్న పోలీసులను ఆరా తీయడం మొదలుపెట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి బయటఉన్న కొద్దిపాటి జనాన్ని స్టేడియంలోకి పంపే పనిలో పడ్డారు.
రాహుల్ను వ్యాన్లో కూర్చోబెట్టి కిందకు దిగిన సీఎం రేవంత్ ముఖంలో ఆందోళన
బయట ఉన్న జనాన్ని స్టేడియంలోకి పంపాల్సిందిగా సూచిస్తున్న సీఎం రేవంత్
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సభావేదికపై రాహుల్, కాంగ్రెస్ అభ్యర్థులు రంజిత్రెడ్డి (చేవెళ్ల), సునీత (మల్కాజ్గిరి), చామల కిరణ్కుమార్ (భువనగిరి)
దాదాపు గంటసేపు వేచి చూసిన తర్వాత రాహుల్గాంధీ వేదికపైకి ఎక్కి ప్రసంగిస్తున్న సమయంలో కూడా సభా ప్రాంగణంలో ఇలా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి (ఇన్సెట్ రాహుల్ ప్రసంగిస్తున్న ఫొటో)
స్టేడియం వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నప్పుడు సాయంత్రం 6 గంటలకు ఉన్న జనం వీరే