Congress | ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎంపీ సీటు కూడా మంత్రుల కుటుంబాలకే ఇస్తే ఇక తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే జరిగితే తాము ఎప్పటికీ ఇలాగే ఉండాలా? అని పాత కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించడం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నట్టు తెలిసింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ ముగ్గురికి కాకుండా ఈసారి వేరే వ్యక్తికి ఇవ్వడమే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు సమాచారం.
ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వంపై నేడో, రేపో, తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోనే చైతన్యవంతమైన ఓటర్లు ఉన్న ఖమ్మం జిల్లాలో ఎంపీ సీటు కోసం మహామహులు పోటీపడుతున్నారు. తమ వారికి టికెట్ ఎలాగైనా ఇప్పించుకోవాలని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీటు విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడి కోసం పోటీపడుతున్నారు.
అయితే.. తమకు అందిన అభ్యర్థుల జాబితాను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానానికి.. ఖమ్మం అభ్యర్థి ఎంపిక కొంత ఇబ్బందికరంగా మారినా.. అంతిమంగా సామాజిక సమీకరణల ఆధారంగా టిక్కెట్ కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముగ్గురు మంత్రులలో ఏ ఒక్క కుటుంబానికి సీటు కేటాయించినా అంతర్గతంగా పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం, ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఇప్పటికే మంత్రి పదవులను అనుభవిస్తున్న వారి కుటుంబాలకు ఎంపీ టిక్కెట్ కేటాయించడం వల్ల సాధారణ ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా సామాజిక సమీకరణల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంతకాలం ఆలస్యం కావడానికి కూడా ఇదే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు గత నాలుగు దశాబ్ధాల కాలంగా ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో సైతం ఓసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. అయితే.. ప్రాతినిధ్యం విషయంలో తమకు ఇంత వరకూ ఏ మాత్రం న్యాయం జరగలేదన్న తీవ్ర అసంతృప్తి బీసీల్లో నెలకొంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. అందులో దాదాపు 9 లక్షలు బీసీ ఓటర్లున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి దరఖాస్తు చేసుకున్న బీసీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. అందులో యాదవ సామాజిక వర్గానికి చెందిన నాగ సీతారాములు పేరును పలువురు సీనియర్ నేతలు సూచించినట్టు సమాచారం. ఖమ్మం ఎంపీ నియోజకవర్గ పరిధిలో మూడున్నర లక్షలకుపైగా యాదవ ఓటర్లు ఉండడంతోపాటు ఆయన వివాదరహితుడని, పార్టీని అంటిపెట్టుకుని పని చేస్తున్నాడని, అతనిపై అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేపు జరగనున్న సీఈసీ సమావేశంలో అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది.