Congress Party | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ కాక రేపుతున్నది. పలు నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రెండో విడత 45 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. చివరి వరకు టికెట్ దక్కుతుందని ఆశించినా ఫలితం దక్కకపోవడంతో నేతలతో పాటు అనుచరులు పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆయన అనుచరులు గాంధీభవన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. టికెట్లను అమ్ముకున్నాడంటూ ఆరోపించారు. అయితే, గాంధీ భవన్ లోపలి గేట్లను సిబ్బంది మూసివేశారు. పార్టీ జెండాలను విష్ణువర్ధన్రెడ్డి అనుచరులు తగులబెట్టారు. ఇటుకలు, రాళ్లను కార్యాలయంపైకి విసిరారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న ఏకైక స్థానం జూబ్లీహిల్స్ స్థానమని విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. తనకే టికెట్ ఇస్తామని మాణిక్ రావు థాక్రే సైతం చెప్పారని, చాలా రోజులుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నానన్నారు. ఎస్సటీ, బీసీ, సెటిలర్స్ తదితర అన్ని కమ్యూనిటీ ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్లో కేవలం ఒక కమ్యూనిటీ కోసమే టికెట్ ఇవ్వడం దారుణమన్నారు. ఒకే ఇంట్లో రెండు టికెట్స్ ఇవ్వం అనే వాదన నిజమైతే.. ఎంతో మందికి ఇచ్చారన్నారు. హాఫ్ టికెట్ గాళ్లకు టికెట్ ఇచ్చారని.. హైదరాబాద్లో పీజేఆర్లాంటి నాయకుడి కుటుంబానికి టికెట్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని, ప్రజలకు దండాలు పెట్టే వారికి కాకుండా.. నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే కాంగ్రెస్లో టికెట్ ఇచ్చారంటూ విమర్శించారు.
శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు సీనియర్ నేత జరిపేట జైపాల్ యాదవ్. పార్టీ మరొకరికి టికెట్ కేటాయించడంతో మనస్థాపానికి గురైన ఆయన.. ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. పార్టీ తమను మోసం చేసిందని.. త్వరలోనే పార్టీని మారనున్నట్లు స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. మరో వైపు కూకట్పల్లి నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడ్డ గొట్టుముక్కల వెంగళరావు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేశానని, వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తికి రాత్రికి రాత్రే కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ను కేటాయించడంపై మనస్థాపంతోనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.