హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, భూ మాత పోర్టల్ను ప్రవేశపెడతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి నూతన పోర్టల్ ఏర్పాటుపై దృష్టిసారించారు. ఇప్పటికే రెవెన్యూ శాఖపై, ధరణి పోర్టల్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు భూ మాత పోర్టల్పై దృష్టిసారించారు. ధరణిని పూర్తిగా ఎత్తివేసి కొత్త పోర్టల్ ప్రవేశపెట్టాలా? లేదా ఉన్న పోర్టల్లోనే కావాల్సిన మార్పులు, చేర్పులు చేయాలా? అనే అంశంపై కొన్ని రోజులుగా తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఉన్న పోర్టల్లోనే మార్పులు చేయాలని అధికారులు సూచించగా, హామీ ఇచ్చిన మేరకు కొత్త పోర్టల్ తేవాల్సి ఉంటుందని అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నారట.
ఈ నేపథ్యంలో ముందుగా ఇతర రాష్ర్టాల్లో భూ రికార్డుల నిర్వహణపై అధ్యయనం చేసి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారుల ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్కు పంపించినట్టు సమాచారం. ‘భూ లేఖ్’ పేరుతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థను నిర్వహిస్తున్నది. ఈ పోర్టల్ ఆధారంగా లావాదేవీలు జరుగుతున్న విధానం, భూ సర్వే ఎలా నిర్వహిస్తున్నారు? వంటి వివరాలపై అధ్యయనం చేసి నివేదిక అందించనున్నారు. ధరణి తరహాలోనే భూ లేఖ్లోనూ రాష్ట్రంలోని వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు లోన్లు, వ్యవసాయ ప్రణాళికలు వంటివాటికి ఈ రికార్డే ఆధారంగా ఉన్నది. వాస్తవానికి ధరణితో పోల్చితే పెద్దగా తేడాలు లేవు. ఈ క్రమంలో అధికారులు ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.