T Congress List | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే చివరి అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. పటాన్ చెరు నుంచి పోటీ చేసే అభ్యర్థిని మార్చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. ఈ స్థానం నుంచి టీపీసీసీ నేత పటేల్ రమేశ్ రెడ్డి తొలి నుంచి గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్నా, అధిష్టానం.. దామోదర్ రెడ్డికే టికెట్ కేటాయించింది.
ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎస్సీ స్థానాన్ని మందుల శ్యామ్యూల్కు కేటాయించింది. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకి దయాకర్ చివరి వరకూ ఆశలు పెట్టుకున్నారు. ఇక చార్మినార్ నుంచి మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, మిర్యాల గూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. పటాన్ చెరు నుంచి నీలం మధు స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించింది. మిర్యాల గూడ నుంచి అభ్యర్థిని ప్రకటించడంతో సీపీఎంకు కాంగ్రెస్ ‘రిక్త’హస్తం చూపింది.