బంజారాహిల్స్, జూన్ 6: ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామంటూ మాట ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లింది. కాసుల వేటలో పడిన కాంగ్రెస్ సర్కార్ నగరం నడిబొడ్డున అడవిని తలపించేలా భారీ వృక్షాలతో చుట్టుపక్కల వారికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతున్న ఎనిమిది ఎకరాల భూమిని అమ్మకానికి పెడుతున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఏసీబీ కార్యాలయం, ఎమ్మెల్యే కాలనీకి మధ్యనున్న సుమారు రూ.1000 కోట్ల విలువైన 8.24 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు హెచ్ఎండీఏ కసరత్తు ప్రారంభించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో ఈ స్థలాన్ని సందర్శించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.. ‘ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం’ అని చెప్పిన మాటలు నీటిమూటలుగా మారాయి. ‘కాలనీవాసుల కోరిక మేరకు నగరానికే తలమానికంగా థీమ్ పార్కుగా మారుస్తాం’ అంటూ అధికారులు ఇచ్చిన హామీ గాలికి పోయింది. ఇక్కడ థీమ్ పార్కు ఏర్పాటు చేస్తే సమీపంలోని ప్రాంతాలకు చల్లదనంతో పాటు ఆక్సిజన్ అందుతుందని ఆశతో ఉన్న స్థానికుల ఆశలమీద కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది.
షేక్పేట మండలంలోకి వచ్చే హకీంపేట విలేజ్ పరిధిలోని సర్వే నంబర్ 102/1, టీఎస్ 1/పీ, 3/పీ, బ్లాక్-జే, వార్డు 12లో సుమారు పదెకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఇందులో కొంతభాగాన్ని ఎమ్మెల్యే కాలనీకి చెందిన కొంతమంది కాలనీ స్థలం అంటూ ఆక్రమించగా.. కొన్ని ఆక్రమణలను రెవెన్యూశాఖ తొలగించింది. మిగిలిన స్థలానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో గత ఏడాది రూ.50 లక్షల వ్యయంతో ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఈ స్థలంలో అరుదైన వృక్షాలు, కొండరాళ్లు ఉండటంతో పచ్చదనంతో కళకళలాడుతున్నది. దీంతో ఈ స్థలాన్ని థీమ్ పార్కుగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కాలనీవాసులతోపాటు స్థానికులు అధికారులను కోరారు.
ఈ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సహా ఇతర అధికారులంతా ఈ స్థలాన్ని ప్రజల అవసరాల కోసమే వినియోగిస్తామని, అవసరమైతే హెచ్ఎండీఏకు అప్పగించి అద్భుతమైన థీమ్ పార్కుగా మారుస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం ఈ స్థలాన్ని హెచ్ఎండీఏకు బదలాయించారు. ఈ స్థలంలో ఎన్నో ఏండ్లుగా పెద్దమ్మతల్లి ఆలయం ఉండగా.. అక్కడికి వెళ్లేందుకు దారిలేకపోవడంతో రాత్రికి రాత్రే ఆలయాన్ని తొలగించి, విగ్రహాన్ని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఓ ఆలయంలో భద్రపర్చారు. ఇక ఈ స్థలాన్ని థీమ్ పార్కుగా మారుస్తారని ఎదురుచూస్తున్న కాలనీవాసుల ఆశలను నీరుగారుస్తూ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 8.24 ఎకరాల స్థలాన్ని వేలం వేస్తున్నామని శనివారం ఇక్కడ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలంలో భారీ వృక్షాలను రియల్ ఎస్టేట్ సంస్థలు నరికివేస్తాయని, ఇప్పటికే కేబీఆర్ పార్కు వద్ద వందలాది చెట్లను నరికివేశారని, ఎమ్మెల్యే కాలనీలోని చెట్లను కూడా నరికివేస్తారా అంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జూన్ 12న ప్రీ బిడ్డింగ్ సమావేశం ఉంటుందని, 17లోగా బిడ్డింగ్ కోసం నిర్దేశిత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, 19న వేలం నిర్వహిస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. దీంతో ఈ స్థలాన్ని కాపాడుకోవడం కోసం ఆందోళన పట్టేందుకు కాలనీవాసులు, ప్రజా సంఘాలు,
పర్యావరణ ప్రేమికులు సిద్ధమవుతున్నారు.