Congress | బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు సమావేశానికి రావాల్సిన మంత్రి ఆలస్యంగా రాగా.. తమకు గౌరవం ఇవ్వడం లేదని మంత్రిపై ఒక సీనియర్ నాయకుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంత సద్దుమణిగి ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆయన్ను కార్యకర్తలు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేను పట్టించుకోకుండా మంత్రిని సన్మానించడంలో కార్యకర్తలు బిజీ అయిపోయారు. ఇది ఎమ్మెల్యే అసహనానికి కారణమయ్యింది. ఇలా అన్ని రకాలుగా గందరగోళంగా కాంగ్రెస్ సభ ముగిసింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలస్యంగా రావడంపై కార్యకర్తలు ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఇతర మండలాల నాయకులకు సమావేశంలో మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారని.. కానీ స్థానిక నాయకుడినైన తనకు మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రి ముందు తన బాధను వెల్లగక్కారు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో మంత్రి జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో ప్రభాకర్ శాంతించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతుండగా నాయకులు, కార్యకర్తలు మంత్రిని సన్మానించేందుకు పోటీపడ్డారు. దీంతో తాను చెప్పేది ఎవరూ కూడా వినడం లేదని ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరుకాకపోవడంపై సమావేశంలో గుసగుసలు పెట్టుకున్నారు.
ఇక రామకృష్ణాపూర్లోని శివాజీనగర్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో సాక్షాత్తూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదుటే లుకలుకలు బయట పడ్డాయి. రామకృష్ణాపూర్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అప్జల్ (లాడెన్) మాట్లాడుతూ.. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనకు ఆదరణ కరువైందని అదే వేదిక పక్కన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, కానీ తమను కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని, తమను అగౌరవ పరుస్తున్నారని బాధపడ్డారు. ఎమ్మెల్యే చుట్టూ చేరి భజన చేసే వాళ్లకి మాత్రమే కాదు.. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు కూడా గౌరవమివ్వాలని కోరారు. దీంతో అక్కడున్న మిగతా నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.