హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25( నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్లంటేనే నచ్చని కాంగ్రెస్ పార్టీ.. ఆటోలు కనిపించకుండా చేయాలనే లక్ష్యంగా పెట్టుకుందని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఆటోవాలాల కుటుంబాలను రోడ్డున పడేసిందని వాపోయారు. ఇప్పుడు ఏకంగా ఆటోలపై దాడులు చేస్తుండడం హేయమైన చర్య అని విమర్శించారు. మంత్రి సీతక్కకు ఆటోవాలాలపై ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. శనివారం సంబంధిత వాహన సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనలో సిబ్బంది అత్యుత్సాహంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోల అద్దాలు ధ్వంసం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై వాహన సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆటో డ్రైవర్లు అంటే ఎందుకంత చిన్న చూపు.. అని ప్రశ్నించారు. మంత్రి సీతక్క స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పాలి
కాంగ్రెస్కు ఆది నుంచి ఆటో డ్రైవర్లంటే అక్కసు. అధికారంలోకి రాగానే ఆటోవాలాల జీవితాలను నాశనం చేసింది. ఉచిత బస్సు స్కీం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 30 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఇప్పుడేమో ఏకంగా మంత్రి పర్యటనలోనే సిబ్బంది ఆటో అద్దాలు ధ్వంసం చేయడం సరికాదు. మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం.
-వేముల మారయ్య, అధ్యక్షుడు, టీఏటీయూ
సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకంతో ఇప్పటికే ఆటోవాలాలు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. డ్రైవర్లు ఓవైపు గిరాకీ లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే దయ చూపాల్సింది పోయి… ఆటోలను ధ్వంసం చేయడం ఏంటి? మంత్రి సీతక్క ఈ ఘటనపై విచారణ జరిపించాలి. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ములుగులో చాలా రూట్లల్లో బస్సులు సరిగ్గా నడవవు. అక్కడి ప్రయాణికులకు ఆటోలే దిక్కు. ఘటనపై మంత్రి స్పందించకుంటే అన్ని వాహన సంఘాలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.
-షేక్ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్
నష్టపరిహారం చెల్లించాలి
ములుగులో సీతక్క కాన్వాయ్ ఎదుట నిరసన తెలిపిన ఆటో డ్రైవర్లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఏజెన్సీలో ఆటో డ్రైవర్లంతా దళితులే. దళితులపై దాడి చేయడం హేయమైన చర్య. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దని అనుకుంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆటో డ్రైవర్ల సమస్యలపై సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికీ ప్రకటన చేయకపోవడం బాధాకరం. ఆటోడ్రైవర్లకు నష్ట పరిహారం చెల్లించాలి. ఉచిత బస్సు స్కీంకు బదులు మహిళకు నెలకు రూ.2వేల ప్రయాణ ఖర్చులు ఖాతాలో జమ చేయాలి.
-రవి శంకర్ అల్లూరి, జాతీయ ప్రధాన కార్యదర్శి, భారతీయ ప్రైవేట్ రవాణా మజ్దూర్ మహ సంఘ్