సంగారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికొదిలేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గ్రామాల్లో తాగు నీరు రావడంలేదని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ పార్టీ పనిగాపెట్టుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్లో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్చెరూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయస్తున్నారని విమర్శించారు.
బెరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. తమ పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్లోకి రావాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. విపక్ష నేతలను ఏదోరకంగా జైలుకు పంపాలని చూస్తున్నారని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎమ్మెల్యే సోదరుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు కేసులు పెట్టారని.. వాటిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్షవేస్తామని హెచ్చరించారు.
2011-12లో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే క్వారీ లీజుకు తీసుకున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్వారీకి సంబంధించిన అన్ని అనుమతులు తమకు ఉన్నాయని చెప్పారు. మేం తప్పు చేసినట్లు తేలితే జరిమానా విధించాలన్నారు. బెదిరింపులకు బయపడేదిలేదని, ప్రజా కోర్టు లో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.