KTR | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పదని తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఆరు గ్యారెంటీలు 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ హితవుపలికారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది భారత రాష్ట్ర సమితినే అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను భారత రాష్ట్ర సమితి నేతలకు కట్టపెట్టారనితెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను తట్టుకొని వీరోచితంగా పోరాడి, బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది సామాన్య విజయం కాదు.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం అని కేటీఆర్ అన్నారు. “యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అరాచక కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని మట్టికరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది” అని కేటీఆర్ పేర్కొన్నారు.
పంచాయతీ ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి. కానీ, ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడింది.. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన ‘జంగ్ సైరన్'” అని అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి రెండేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని, పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం, రైతు బంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలే ప్రజల ఆగ్రహానికి కారణమన్నారు. రేవంత్ పాపం పండింది కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో ఈ తిరుగుబాటు వచ్చిందన్నారు. మా ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో, సాక్ష్యం రాజకీయాలను, రాజకీయ హింసను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయితే మా పార్టీ కార్యకర్తల పైన దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరి కి భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు.