Telangana | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించాడు. అంతటితో ఆగకుండా కారులో పక్క సీటులో కూర్చున్న వ్యక్తిపై కేసును మార్పించాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ పోలీసులు.. ఇది నిజమేనని తేల్చారు.
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఎస్సై వారం రోజుల క్రితం వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మద్యం సేవించి కారులో వెళ్తున్న ఐనవోలు మండలానికి చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. దీంతో వారిని ఎస్సై పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు ఫోన్ చేసి కారు డ్రైవింగ్ చేసిన యువకుడిని వదిలిపెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే కొడుకు చెప్పడంతో అతడిని వదిలేశారు. అయితే పక్క సీటులో కూర్చున్న యువకుడిని మాత్రం ఎస్సై రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి చిత్ర హింసలకు గురి చేశారు.
బాధిత యువకుడు బంగారు గొలుసు కుదవబెట్టి పోలీస్ స్టేషన్లో రూ.లక్ష ఇచ్చి బయటకొచ్చారు. అయితే మరోసారి బాధితుడి వద్ద 8 గ్రాముల గంజాయి దొరికినట్లుగా ఎస్సై కేసు నమోదు చేశాడు. పోలీసుల దెబ్బలతో బాధితుడి ఆరోగ్యం దెబ్బతినడంతో అతన్ని చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై బాధిత కుటుంబం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ పోలీసులు.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న యువకుడిని పోలీసులు కొట్టడం, రూ.లక్ష వసూలు చేసి గంజాయి కేసు పెట్టడం నిజమేనని తేల్చారు. మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిపై కేసు కాకుండా చూసేందుకు రూ.4 లక్షలు లంచం తీసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు తప్పించాడని గుర్తించారు. సదరు ఎమ్మెల్యే కొడుకు గతంలో పోలీసు శాఖలో పనిచేసినట్లు సమాచారం.