Komatireddy Rajagopal Reddy | హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను, మా అన్న ఇద్దరం సమర్థులమే.. ఇద్దరం గట్టిగా ఉన్నాం.. మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టే. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా.. మీరు మాటిచ్చారు ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. ఎందుకు కుదరటం లేదు సమీకరణలు? ఎవరడ్డుకుంటున్నారు నాకు మంత్రి పదవి రాకుండా అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్న. ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు.. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉంది. ప్రభుత్వ దవాఖానక పోతే పేదోడికి న్యాయం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి. పేదవాళ్లకు అండగా ఉండాలని నేను కష్టపడుతున్న. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదు అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.